యాదగిరిగుట్ట, మే 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధులు, క్యూ కాంఫ్లెక్స్, గర్భాలయ ముఖ మండపం భక్తులతో నిండిపోయాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. స్వామివారి ధర్మదర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యార్చనలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృతాలు, గంగాజలంతో నిజాభిషేకం జరిపి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపారు.
స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహనంపై కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. మండపంలో స్వామి, అమ్మవార్లను తూర్పునకు అభిముఖంగా వెంచేపు చేసి నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారికి మధ్యాహ్న ఆరగింపు చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం సహస్రనామార్చనలు, తులసీ నామార్చనలు అత్యంత వైభవంగా సాగాయి. రాత్రి స్వామివారికి జరిగిన శయనోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖజానాకు రూ.47,39,167 ఆదాయం సమకూరిందని ఈఓ గీత తెలిపారు.