యాదగిరిగుట్ట, జూలై 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శన నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు సాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. లలితాపారాయణం గావించారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 15,99,166 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
హుండీల ఆదాయం రూ.1,85,96,202
స్వామివారి 19 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటిందని ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు. యాదాద్రి కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా నగదు 1,85,96,202, 159 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 300 గ్రాముల మిశ్రమ వెండి, 1,249 యూఎస్ డాలర్లు, 65 దిరామ్స్, ఆస్ట్రేలియా డాలర్లు 150, కెనడా డాలర్లు 5, థాయిలాండ్, ఇండోనేషియా, కువైట్, బహ్రెన్ దేశాలకు చెందిన కరెన్సీ సమకూరినట్లు వివరించారు.
స్వామివారి సేవలో ప్రముఖులు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పాల్గొని తరించారు. మంగళవారం ఉదయం కొండపైకి చేరిన ఆయన మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారి స్వామివారి ప్రసాదం అందజేశారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, పర్యవేక్షకుడు రామ్మోహన్ స్వామివారి ప్రసాదం అందజేశారు.