యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా మరో మైలురాయిని చేరుకున్నది. కొత్త జిల్లాల వారీగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల నెరవేరబోతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు విజయవంతంగా సాగుతుండగా, తాజాగా యాదాద్రిభువనగిరి జిల్లాకు సైతం వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఆ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం జీఓ నంబర్ 85ను జారీ చేసింది. 100 సీట్ల సామర్థ్యంతో కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అదనపు పడకలు, అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్లు, నిపుణులైన వైద్యులు, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కళాశాల మంజూరు చేయడంపై ఆ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. కాగా, నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు ఈ సంవత్సరం ఎంబీబీఎస్ పూర్తి చేయనున్నారు. సూర్యాపేటలో అధునాతన భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నల్లగొండలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కేంద్రం పట్టించుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఏటా కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. అయితే గతంలో కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లాకు వచ్చిన సందర్భంగా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో కొత్త కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కొనసాగుతుందని జీఓలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ నియంత్రణలో ఉండగా, ఇక నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో కాలేజీ భవనం నిర్మాణానికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించనున్నారు. కళాశాల భవనాన్ని ఆర్అండ్బీ శాఖ నిర్మించనుండగా, ఆస్పత్రి భవనం, పరికరాలు, ఫర్నీచర్, రిక్రూట్మెంట్ తదితర అవసరాలను టీఎస్ఎంఎస్ఐడీసీ చూసుకోనున్నది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. మెడికల్ కాలేజీలతో అనుబంధంగా అనేక వసతులు ఏర్పడనున్నాయి. కళాశాలలో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. కళాశాల ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి. కొత్తగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను రిక్రూట్ చేయనున్నారు. అంతేకాకుండా డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ను నియమించనున్నారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా వందల మందికి ఉపాధి దక్కనుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి..!
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే మెడికల్ కాలేజీల జాబితా విడుదలైంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కాలేజీ ఏర్పాటు కానున్నది. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఉమ్మడి జిల్లాలో కాలేజీల సంఖ్య మూడుకు చేరింది.
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు..
ఉమ్మడి రాష్ట్రంలో చిన్నపాటి ప్రమాదం జరిగినా, జబ్బు చేసినా మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాద్కు పరుగులు తీయాల్సి వచ్చేది. చికిత్స కోసం వారాలు, నెలల పాటు పట్నంలోనే ఉండాల్సిన దుస్థితి. జిల్లాలో కనీస వైద్య సదుపాయం అందించే పరిస్థితి ఉండేది కాదు. కానీ స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు, వైద్య విద్యను తెలంగాణ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో భాగంగానే జిల్లాకు కాలేజీ మంజూరైంది. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజీ రానుండటంతో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకుని మొత్తం 35 వైద్య విభాగాల సేవలు అందే అవకాశం ఉంటుంది. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తుంది.