యాదగిరిగుట్ట, మార్చి17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి విశేష ఘట్టం ఎదుర్కోలు వేడుక కనులపండువగా జరిగింది. ముక్కోటి దేవతల సాక్షిగా ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాఢ వీధుల్లో కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. భక్తజనుల జయజయ ధ్వనులు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆశ్వవాహనంపై నరసింహ స్వామిని ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారి విగ్రహాన్ని తూర్పునకు అభిముఖంగా, అమ్మవారి విగ్రహానిన పశ్చిమ దిశకు అభిముఖంగా ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్వికులు ఆసీనులై పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. రెండు జట్లుగా ఎదుర్కోలు తంతును నిర్వహించారు. అర్చక బృందం అమ్మవారి అంద చందాలు, సుగుణాలు కీర్తించారు. అమ్మవారి వైపున యాదగిరిగుట్టకు చెందిన సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ధరూరిరామానూజాచార్యులు పాల్గొన్నారు. అమ్మలేనిది స్వామి లేడు. స్వామిని లోకానికి పరిచయం చేసింది అమ్మవారే అనే అంశాన్ని ఉదాహరణలతో వివరించారు. యాదగిరిగుట్టలో స్వయంభూ లక్ష్మీనారసింహ స్వామిగానే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడన్నారు. పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి అపూర్వమైన అనుగ్రహం లోకాలకు అందిపజేస్తున్నది అమ్మవారేనని తెలిపారు. స్వయంభూ అంటేనే అమ్మవారని అన్నారు. స్వామివారి కల్యాణం అమ్మవారితో సోమవారం రాత్రి జరిపేందుకు సుముహూర్తం నిశ్చయించారు.
పరమార్థ తత్వమే ఎదుర్కోలు
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక ఎదుర్కోలు ఉత్సవమని, జీవ, పరమాత్మకు ఇద్దరికి నిర్వహింపబడే నిత్య సమ్మేళన రూపమైన పరమార్థ తతమే ఈ ఎదుర్కోలు అని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు తెలిపారు. స్వామివారు ఆశ్వవాహనరూఢుడై భక్తులను అనుగ్రహించుట ఎంతో ప్రశస్తమైయున్నదని చెప్పారు.
ముగ్ధమనోహరంగా జగన్మోహిని అలంకారం
ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా స్వామివారిని ఆదివారం జగన్మోహిని అలంకారంలో, పెండ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. జగన్మోహినీ అలంకార సేవను ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టువస్ర్తాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. మూలమంత్ర జపాలు, స్తోత్రాలు, మంత్రోచ్ఛరణ, ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాశురాలను పఠిస్తూ మంగళవాయిద్యాల నడుమ భక్తులు గోవిందా.. గోవిందా అంటూ పాల్గొన్నారు. ఎడమచేతిలో అమృత కలశం, కుడిచేతిలో తన జడను తిప్పుతూ అద్భుత భంగిమలో స్వామివారు దర్శమివ్వగా భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు. పరమాత్మ అద్భుత సౌందర్య స్వరూపమే జగన్మోహిని అని శ్రీమాన్ అమరవాధి వేంకట నరసింహాచార్యులు అలంకార విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల య అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్బాబు, రఘు, గట్టు శ్రవణ్కుమార్, రాంమోహన్, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి, రాజన్బాబు పాల్గొన్నారు.
అలరిస్తున్న ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందుగా కొనసాగుతున్నాయి. మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీరామభక్త భజన మండలి, కార్వాన్కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టకు చెందిన శ్రీయాదాద్రి భక్తజన సమాజం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, శ్రీమాన్ అమరవాధి వేంకట నరసింహాచార్యులు గారిచే సుదర్శన నారసింహ హోమం, నృసింహ ఆవిర్భావంపై ఉపన్యాసం నిర్వహించారు. చేబ్రోల్ నారాయణ దాస్, భాగవతార్ వారిచే భీష్మ ప్రతిజ్ఞ హరికధాగానం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కరీంనగర్కు చెందిన ఎ. తిరుమల వారితో భక్తిసంగీత కార్యక్రమం, దిస్కూల్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అకాడమి ఆధ్వర్యంలో భరతనాట్యం, డాక్టర్ వనజా ఉదయ్తో కూచిపూడి నృత్యప్రదర్శన, జొన్నలగడ్డ సత్యశ్రీరాం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కార్యక్రమం నిర్వహించారు.
350 మంది పోలీసులతో బందోబస్తు..
తిరు కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో 350 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. రాచకొండ కమిషనరేట్ నేతృత్వంలో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అడిషినల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్లతోపాటు ఇతర మహిళా పోలీసులు, అధికారులు పాల్గొననున్నారు. మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు కుటుంబ సమేతంగా కల్యాణోత్సవంలో పాల్గొననున్నట్లు సమాచారం.
స్వామివారికి టీటీడీ పట్టువస్ర్తాలు
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయంగా మేల్చాట్ పట్టు వస్ర్తాలను సమర్పించారు. తిరుపతి దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాతం, పర్యవేక్షకులు సురేశ్, అర్చకులు, అధికారులతో కలిసి ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం జగన్మోహిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకొని ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావుకు పట్టువస్ర్తాలను అందజేశారు.
నేడు తిరుకల్యాణ మహోత్సవం
స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునః ప్రారంభానంతరం రెండోసారిగా జరిగే వేడుకకు ఉత్తర మాఢవీధుల్లో వాయుదిశలోని లిప్టు, రథశాల ప్రాంతంలో మూడు పంచతల రాజగోపురాలతో మహాద్భుతంగా కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక ముందుభాగంలో 3,500 మందికి కూర్చునే విధంగా వసతులు కల్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చనున్నారు.
ఉచిత వైద్య శిబిరం
యాదగిరి కొండపైన హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీసాయి సంజీవని ప్రైవేట్ ఆసుపత్రి, కొండకింద కొత్త బస్టాండ్, కల్యాణకట్ట వద్ద యాదగిరిగుట్ట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.