యాదగిరిగుట్ట, జనవరి31:యాదగిరి గుట్టలో అత్యాధునిక వసతులతో ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మాణం పూర్తయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఇక్కడికి చేరుకుంటాయి. కొండ కింద లక్ష్మీపుష్కరిణి పక్కన 5 ఎకరాల్లో రూ.6.90 కోట్లతో నిర్మించారు. నేడు దీనిని ప్రారంభించేందుకు మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.
ఐదు ఎకరాల్లో..
యాదగిరికొండకు ఉత్తర భాగంలో లక్ష్మీపుష్కరిణి పక్కన, నిత్యన్నదాన భవనం ముందుభాగంలో 5 ఎకరాల్లో బస్ టెర్మినల్ను నిర్మించారు. రూ. 6.90 కోట్ల అంచనా వ్యయంతో 44 పిల్లర్లతో 8,800 ఎస్ఎఫ్టీ ఏరియాలో బస్టాండ్ను తీర్చిదిద్దారు. ఇందులో క్లాక్ రూమ్, క్యాంటీన్, పురుషులకు 7 మూత్రశాలలు, ఒకటి స్నానాల గది, 2 టాయిలెట్స్తోపాటు దివ్యాంగులకు ప్రత్యేక బాత్రూమ్ నిర్మించారు. దాంతోపాటు మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, బాత్ రూమ్లు ఏర్పాటు చేశారు. యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం బస్స్టాండ్లో 5 దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో దుకాణం 8.3X 10 ఫీట్లతో నిర్మించారు. 6 వేల ఎస్ఎఫ్టీలో వెయిటింగ్ హాల్ పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు బస్టాండ్లో నిరీక్షించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. బస్సులు బస్టాండ్కు వచ్చేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు ప్రత్యేక దారులను నిర్మించారు. భక్తులు బస్టాండ్కు వెళ్లేందుకు మరో దారిని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు బస్సు సర్వీసులను పర్యవేక్షించేందుకు బస్టాండ్ మేనేజర్కు ప్రత్యేక గదిని నిర్మించారు. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ, నార్కట్పల్లి, దేవరకొండ, జనగాం ఆర్టీసీ డిపోలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాత దేవాలయాలు తిరుపతి, శ్రీశైలం నుంచి ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి. బస్సులు నేరుగా బస్టాండ్కు వచ్చి నిలిపే విధంగా 10 ప్లాట్ ఫామ్లను నిర్మించారు. భక్తుల రద్దీని బట్టి రానున్న రోజుల్లో మరో 20 ప్లాట్ ఫామ్లను నిర్మించాలని వైటీడీఏ యోచిస్తున్నది. ఇందుకు కోసం కావాల్సిన స్థలాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం
గతేడాది మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభమైనది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఒక్కప్పుడు రోజుకు 5 నుంచి 10 వేల మంది మాత్రమే భక్తులు వచ్చే వారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత 15 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు వస్తున్నారు. శని, ఆది వారాల్లో 50వేల నుంచి 60 వేల మంది వరకు వస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా కొండకింద అత్యాధునిక వసతులతో ఆర్టీసీ బస్ టెర్మినల్ను నిర్మించారు. ఏకకాలంలో 4 వేల మంది భక్తులు ఉండేలా, రోజుకు 50 వేల మంది భక్తుల తాకిడిని తట్టుకునేలా నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఆధ్యాత్మిక మెరుగులు
యాదాద్రి కొండ చుట్టూ నిర్మాణాలు పూర్తిగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరిగాయి. కళ్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి మాదిరిగా దేవతామూర్తులు, శంకు చక్ర నామాలతోపాటు పంచనారసింహుడి అవతరాలు కనిపించేలా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. బస్టాండ్ను చూసే భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగేలా రూపొందించారు.
దేవస్థాన బస్సు ప్రాంగణం కూడా..
బస్టాండ్ పక్కనే దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. రూ. 8.79 కోట్లతో 3 ఎకరాల్లో నిర్మించే బస్టాండ్లో 10 ప్లాట్ఫామ్లు, టికెట్ కౌంటర్, 2 ఏటీఎం సెంటర్లు, 5 షాపులు, క్లాక్ రూమ్, ఎగ్జిట్ లాబీ, కామన్ వెయిటింగ్ ఏరియా, స్త్రీలు, పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇన్చార్జిల రూమ్ నిర్మిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి స్వామివారి కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా నిర్మించే దేవస్థాన బస్సు ప్రాంగణం వద్దకు వస్తారు. అక్కడి నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో నడిపే బస్సుల్లో కొండపైకి చేరుకుంటారు.
నేడు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం
యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్ను నేడు ఉదయం 8 గంటలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించనున్నారని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రత్యేక అతిథులుగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.