యాదాద్రి, జూలై 22 : యాదాద్రి క్షేత్రంలో పంచనారసింహుడికి నిత్యారాధనలు శుక్రవారం శాస్ర్తోక్తంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు తిరువారాధనలు చేపట్టారు. అనంతరం శ్రీవారికి బాలబోగం నిర్వహించి నిజరూపంలో ఉన్న స్వామివారికి అభిషేకం చేశారు. గంట పాటు స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లకు ఆర్జిత పూజలు కోలాహలంగా నిర్వహించారు.
ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపి లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం వెండి మొక్కుజోడు సేవలు, దర్బార్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. సత్యనారాయణ వ్రత పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రధానాలయ ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలోఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయంలోని వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో ఊయలలో శయనింపు చేసి వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామివారిని 8వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. శ్రీవారి ఖజానాకు రూ.10,24,095 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.