యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణంలో పలువురు ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. స్వర్ణతాపడానికి ప్రజలకు భాగస్వామ్యం కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో మేం సైతం అంటూ ముందుకు వచ్చారు. నమస్తే తెలంగాణ తెలుగు దిన పత్రిక సీఎండీ దివకొండ దామోదర్రావు రూ. 50లక్షలు, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ రూ. 50లక్షలు, హెటేరో గ్రూప్ రూ. 50లక్షలు, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ రూ. 50లక్షలు, హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ రూ. 50లక్షలు, బండి పార్థసారధి రూ. 50లక్షల విలువ గల చెక్కులను ఆదివారం యాదాద్రి బాలాలయంలో ఆలయ ఈవో గీతకు అందజేశారు. అంతకుముందు యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వారికి స్వామివారి ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతనాలయాన్ని వారు సందర్శించారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి ఆలయాన్ని పూర్తి కృష్ణ శిలలతో నిర్మించడం గొప్ప విషయమన్నారు. రాజులు దేవాలయాలు కట్టారని చిన్నప్పుడు చదువుకునే వాళ్లమని, ప్రస్తుతం కళ్లారా చూస్తున్నామన్నారు. భక్తులను సైతం పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహాకార్యంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
నిలువు దోపిడి సమర్పించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్..
స్వామివారి ఆలయ గోపురం స్వర్ణతాపడానికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనకున్న బంగారు నగలను భక్తితో స్వామివారికి నిలువు దోపిడిని సమర్పించుకున్నారు. నూతన సంవత్సరం పురష్కరించుకుని ఆదివారం యాదాద్రీశుడిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం నూతనాలయాన్ని పరిశీలించారు. నూతన సంవత్సరం మొదటిసారి స్వామివారిని దర్శించుకుని యాదాద్రి విమానం గోపురం స్వర్ణతాపడానికి నిలువు దోపిడిని సమర్పించుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టమని అన్నారు.
త్వరలో తమ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరుల సహకారంతో స్వర్ణతాపడానికి మరింత విరాళం సేకరించి స్వామివారికి అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా చూడాలని, ఒమిక్రాన్, ఇతర వైరస్ల భారీ నుంచి రక్షించాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అహార్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చల్లగా చూడాలని స్వామిని కోరినట్లు చెప్పారు.