శ్రీవారి ఖజానాకు రూ. 11,34,797 ఆదాయం
యాదాద్రి, ఫిబ్రవరి25 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది.
నిత్యపూజల కోలాహలం
స్వామివారి నిత్య పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. బాలాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం నిర్వహించారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ. 11,34,797 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ఉన్నతాధికారులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఐఎఫ్ఎస్ జాయింట్ సెక్రటరీ శ్రీకర్రెడ్డి, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ఇండస్ట్రియల్ డైరెక్టర్ డి.కృష్ణ భాస్కర్ వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి సంప్రదాయరీతిలో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని వారు పరిశీలించారు.