శ్రీవారి ఖజానాకు రూ.23,51,100 ఆదాయం
యాదాద్రి, ఫిబ్రవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. పాంచరాత్రగమ శాస్త్రం ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ
లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణంలో సందడి నెలకొంది. స్వామి ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి 4గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము 4గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామి వారికి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతంతో స్వామివారి మేల్కొపిన అర్చకులు లక్ష్మీసమేత నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. హారతి నివేదనలతో అర్చించి, సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. శ్రీవారి ఖజానాకు రూ. 23,51,100 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతం;రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కొనియాడారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా, ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రధానాలయాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చరిత్రలో నిలిచిపో యేలా యాదాద్రి ఆలయం నిర్మించారని కొయాడారు.