యాదాద్రి, ఫిబ్రవరి 22 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. వేకువజామున స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు వివిధ శుద్ధ జలాలతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో సుమారు రెండు గంటలు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పూజల్లో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.