యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడి ఆలయంలో పరమశివుడికి పురోహితులు సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలిసిన బాల శివాలయంలో ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడిని కొలుస్తూ నిర్వహించిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో ఆలంకరించారు. శివాలయ ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. స్వామి వారి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం సుదర్శన నారసింహ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను ఘనంగా నిర్వహించారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లి తిరిగొచ్చే భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతాలు ఆచరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు సోమవారం రూ. 21,23,241 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.