యాదాద్రి, ఫిబ్రవరి19 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద ఆలేరు నియోజకవర్గం నుంచి 106 పాఠశాలలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు. పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించేందుకు నిధుల కేటాయింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని పేర్కొన్నారు. శనివారం ఆలేరు పట్టణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో దాతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రూ.కోటి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే పాఠశాల గదికి పేరు పెట్టుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మరుగుదొడ్లు, విద్యుత్, సురక్షితమైన తాగునీరు, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, అవసరమైతే భవనాల పునరుద్ధరణ, తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులు, ప్రహరీలు, వంటగదులు నిర్మించనున్నట్లు తెలిపారు. 106 పాఠశాలల్లో 32 జిల్లా పరిషత్, 66 మండల పరిషత్, 7 అప్పర్ ప్రైమరీ, ఒక ప్రైమరీ స్కూల్ ఉన్నాయన్నారు. ఆలేరు మండలంలో 11 పాఠశాలలు, ఆత్మకూరు(ఎం) 10, బొమ్మల రామారం 19, గుండాల 9, తుర్కపల్లి 20, రాజాపేట 14, మోటకొండూర్ 7, యాదగిరిగుట్ట మండలంలో 16 పాఠశాలలు ఉన్నట్లు వివరించారు. మూడేండ్లలో మూడు విడుతలుగా పాఠశాలలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 106 పాఠశాలలను గుర్తించి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మన్ల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రభుత్వ విప్ చెప్పారు. సమావేశంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్ణణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కుండె సంపత్, కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, నాయకులు కందుల శ్రీకాంత్, మొరిగాడి వెంకటేశ్, యాదగిరిగుట్ట టీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్కు సన్మానం
బొమ్మలరామారం : మండలంలోని మునీరాబాద్ను దళిత బంధు పథకం అమలుకు ఎంపిక చేయడంపై గ్రామస్తులు, దళితులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. గ్రామం ఎంపికయ్యేందుకు సహకరించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తొంట సత్యనారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీపతి బాలయ్య, బొగ్గు నర్సయ్య, దానయ్య, రాములు, రాజు, శంకరయ్య, కాసీం, శంకరయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామానికి చెందిన మేక కలమ్మకు సీఎం రూ.60 వేలు, ఇంజ కుమార్కు రూ.40 వేలు, దాతరుపల్లికి చెందిన చిర్ణమైన అశోక్కు రూ.60వేలు, తుమ్మల సత్యనారాయణకు రూ.60వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. ఆ చెక్కులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శనివారం అందజేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని దాతరుపల్లిలో ఎస్డీఎఫ్ నిధులు రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ బైరగాని పుల్లయ్య, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, ఉపసర్పంచ్ కాల్నె భాస్కర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్గౌడ్ పాల్గొన్నారు.
కొలనుపాక ఆలయాలకు రూ.1.79కోట్లు
యాదాద్రి : ఆలేరు మండలంలోని కొలనుపాక ఆలయాలకు వైటీడీఏ నిధుల కింద రూ. 1,79,74, 743 మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చారిత్రక ఆలయాలైన సోమేశ్వరాలయం, మహాలక్ష్మి వీననారాయణస్వామి ఆలయాలను అద్భుతంగా పునరుద్ధరణ చేసుకుందామని పేర్కొన్నారు.