యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభిమాన నేత సీఎం కేసీఆర్ పాల్గొన్న భువనగిరి సభ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. సభ నిర్వహణ తేదీ ఖరారైన నాటి నుంచే జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వారం రోజులుగా ఇక్కడే ఉండి సభా ఏర్పాట్లను, జన సమీకరణకు చేపడుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులందరూ సమన్వయంతో పనిచేసి భారీ జన సమీకరణ చేయడం ద్వారా సభ సక్సెస్కు దోహదపడ్డారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమకు అప్పగించిన ప్రాంతాల్లో జనాన్ని సమీకరించి సభకు తరలించడంలో సఫలమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగాల్సి ఉండగా.. అంతకు రెండు గంటల ముందే సభా ప్రాంగణం పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయింది. ఇంకా చాలా మంది రోడ్ల పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది చూసిన సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సభా నిర్వహణపై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కంగ్రాట్స్ అంటూ అభినందించారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్ ప్రసంగం..
సభలో కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. బీజేపీపై ఘాటు విమర్శలతో సాగిన సీఎం ప్రసంగం.. ఉద్యమ సందర్భంలో నిర్వహించిన సభల్లో కేసీఆర్ ప్రసంగాన్ని తలపించిందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిబద్ధతతో ఉద్యమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని.. జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ తన ప్రసంగం ద్వారా ప్రభుత్వ పాలనను జనం ముందు ఆవిష్కరింపజేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్లో రాష్ర్టాభివృద్ధికి తమ లక్ష్యాలను వివరించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజానీకం నష్టపోయిందని ఇంకా నష్టపోవద్దంటూ అశేష జనవాహినికి హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించుకుని మార్చిలో ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా మరింత వేగంగా అభివృద్ధి పరంగా పురోగమిస్తుందని చెప్పారు. కాళేశ్వరం జలాలతో త్వరలోనే జిల్లా సస్యశ్యామలం అవనుందని ప్రజానీకానికి భరోసా కల్పించారు. సీఎం ప్రసంగం..ఒక ప్రేరణగా నిలిచిందని, భవిష్యత్ కార్యక్రమాలను ఉత్సాహంతో నిర్వహించుకుని సక్సెస్ చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
టీఆర్ఎస్ వెన్నంటి ఉంటామని చాటిన జనం..
జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్కు భువనగిరి సభ కొండంత భరోసాను ఇచ్చింది. అన్ని వర్గాల ప్రజానీకం సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి టీఆర్ఎస్ వెన్నంటే ఉంటామని సంకేతాలిచ్చారు. ఇది టీఆర్ఎస్ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఏడున్నరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల పాలిట వరంగా మారాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజానీకం టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ పక్షాన నిలుస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
జిల్లాలో నూతన కలెక్టరేట్, పార్టీ కార్యాలయం, వీవీఐపీల సూట్ల ప్రారంభోత్సవం కోసం వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతంగా సాగింది. సభ సూపర్ సక్సెస్ అయ్యింది. సభ విజయవంతానికి కృషి చేసిన ఎమ్మెల్యేలు, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులందరికీ పేరుపేరున ధన్యవాదాలు. మంత్రి జగదీశ్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి అహర్నిశలు కృషి చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. భువనగిరి సభకు వచ్చిన అశేష జనాన్ని చూసి సీఎం కేసీఆర్ చాలా సంతోషపడడమే గాకుండా సభ నిర్వహణ పట్ల శెభాష్ అని మెచ్చుకున్నారు. రానున్న రోజుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఇదే స్ఫూర్తిని కనబర్చాలని కోరారు.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు