యాదాద్రి, డిసెంబర్14: వచ్చే ఏడాది మార్చిలోగా మోటకొండూర్- వంగపల్లి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ రానున్నట్లు బుధవారం ఆమె ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఇప్పటికే ఈపీసీ మోడ్ కింద రూ. 16.43 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రొసిడింగ్ లెటర్ అందిన వెంటనే టెండర్లు పిలిచి మార్చి నెలాఖరులోగా ఎన్హెచ్ఏఐ 163పై వంగపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. దాంతో మోటకొండూర్ మండలంతో పాటు వివిధ గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని చెప్పారు.
అండర్పాస్ కోసం కేంద్రంపై ఒత్తిడి
అండర్ పాస్ కోసం 2018లో అప్పటి జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోకలిసి వినతిపత్రం అంద జేసినట్లు చెప్పారు. దాంతో మంత్రి స్పందిస్తూ రహదారుల పనులు చేస్తున్న గుత్తేదారుల వద్ద మిగులు నిధులుంటే పనులు చేపడతామని, మరిన్ని నిధులు కావాలంటే మంజూరుకు కృషి చేస్తామని తెలిపినట్లు వివరించారు. అయినా పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చిందని, దాంతో ఎంపీలు కేశవరావు, సురేశ్రెడ్డి, రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్ను కలిసి వినతులు అందజేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎంపీ సురేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో నితిన్ గడ్కరీ స్పందించి రూ. 16.43 కోట్లు ఖర్చవుతుందని, ఎన్హెచ్ఏఐ అధికారులకు 2021 నవంబర్ 26న ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ వివరించారు. గత అసెంబ్లీలో జీరో అవర్లో ఈ విష యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
దాంతో ఈపీసీ కింద రూ. 16.43 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లగా గత సోమవారం ఆయన స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ప్రొసిడింగ్ వస్తుందని, మార్చిలోగా పనులు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపా రని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.