నేరేడుచర్ల, నవంబర్ 26:సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ, సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాలపాటు పరిఢవిల్లుతుంది. ఈ క్రమంలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం మరో మారు అవకాశం కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి కొత్తగా ఎన్నికల సంఘం 17 ఏండ్లు నిండిన వారికి ముందస్తుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కానీ.. వారికి 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఓటు హక్కు కల్పిస్తారు. ఇందుకు పదో తరగతి సర్టిఫికెట్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 26, 27తేదీలతో పాటు డిసెంబర్ 3, 4తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ఓటరు ముసాయిదా జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యవకులు ఫారం-6లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డుతోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రం జతచేయాలి. గతంలో ఓటు హక్కు పొందిన వారంతా సమీప బూత్ లెవెల్ కేంద్రాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకోవాలి. పేరు లేకుంటే అక్కడే వెంటనే ఓటు నమోదు చేసుకోవచ్చు. ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.
యాదాద్రి జిల్లాలో 4,18,076 ఓటర్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 990మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,18,076మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,10,078, మహిళా ఓటర్లు 2,07,988, ఇతరులు 10మంది ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 2,16,642 మంది, భువనగిరిలో 2,01,434మంది ఓటర్లు ఉన్నారు.
ఫారం-6 : కొత్తగా ఓటు నమోదుకు ఫారం-6ను ఉపయోగించాలి. రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు లేకుంటే నివాస చిరునామా ధ్రువీకరణ పత్రం జత పరుచాలి.
ఫారం-7 : ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం ఫారం-7ను ఉపయోగించాలి. విచారించిన తర్వాత పేర్లు తొలగిస్తారు.
ఫారం -8 : పేరు, పుట్టిన తేదీల్లో తప్పులను సవరించేందుకు ఫారం -8లో దరఖాస్తు చేసుకోవాలి. సరి పేరుకు సంబంధించిన డిక్లరేషన్, 10వ తరగతి మార్కుల జాబితా, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదో ఒకటి జత పరుచాలి.
ఫారం -8 ఏ : చిరునామా మార్చేందుకు ఫారం-8ఏ ను ఉపయోగించాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు పూర్వ చిరునామాతో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని జత పరుచాలి.
ఫారం- 6ఏ : ఎన్నారైలు ఫారం-6ఏ ను ఉపయోగించాలి. ఇందుకు తాము నివాసముంటున్న దేశాల్లో సిటిజన్ మెంబర్షిప్ లేదని అక్కడి అంబాసిడర్తో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
యువత దరఖాస్తు చేసుకోండి
ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఫారం-6 పూర్తి చేసి సంబంధిత ధుృవీకరణ పత్రాలను జతపరుచాలి. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సరిత, తాసీల్దార్, నేరేడుచర్ల