యాదాద్రి, నవంబర్ 26 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవం శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను ఉంచి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వయంభువుడిని దర్శించుకున్నారు. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 32,44,290 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రత్యేక దర్శనాలకు క్యూలైన్లు
యాదాద్రి దివ్యక్షేత్రంలో రూ.150 టికెట్తో ప్రత్యేక దర్శనం చేసుకోవాలనే భక్తులకు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని దేవస్థానం భావిస్తున్నది. దర్శన సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రతలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మాఢవీధుల్లో ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు. శనివారం ఆమె మాఢ వీధులను పరిశీలించి ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఆలయాధికారులకు సూచించారు. ప్రధానాలయ పునః ప్రారంభానంతరం పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులపై దృష్టి సారించినట్లు తెలిపారు.