యాదాద్రి, అక్టోబర్ 21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో అర్చించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టు వస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు.
వైభవంగా నిత్య తిరుకల్యాణోత్సవం
స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై అధిష్టింపజేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్సేవ వైభవంగా చేపట్టారు. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.14,00,873 ఆదాయం సమకూరినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.
కార్తిక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 23 వరకు ప్రధానాలయంలో ఆరు బ్యాచ్లు, పాతగుట్ట ఆలయంలో ఐదు బ్యాచ్లుగా వ్రతాలను నిర్వహిస్తామని ఈఓ ఎన్. గీత తెలిపారు. ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద నిర్మించిన సత్యనారాయణ వ్రత మండపంలో మొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్త వ్రత మండపం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నదని, వాటిని పూర్తి చేసి 26న భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటిసారిగా జరిగే కార్తీకమాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఈఓ చెప్పారు. అవసరానికి అనుగుణంగా కల్యాణ మండపంలో వ్రతాలను చేపడుతామన్నారు. వ్రతంలో కూర్చునే భక్తులకు కొబ్బరికాయ, నైవేద్యంతో పాటు ముడి సరుకులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
బ్యాచ్ల వారీగా..
వ్రత మండపంలో ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాతగుట్ట ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు.