యాదాద్రి, సెప్టెంబర్ 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో అర్చకులు మంగళవారం స్వామివారి నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వేళ స్వామివారికి తిరువీధి, దర్భార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిపించారు. నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించడంతోపాటు తమలపాకులతో అర్చించారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.9,56,377 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
కల్యాణ మండపానికి గ్రిల్స్
యాదాద్రి ఆలయ వెలుపలి ప్రాకారంలో కల్యాణ మండపానికి అల్యూమినియం గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి వినియోగించే వివిధ రకాల వస్తువుల వద్దకు కోతులు వచ్చి చెల్లాచెదురు చేస్తున్నాయి. దీంతో కోతులు లోపలికి రాకుండా జాలితో కూడిన గ్రిల్స్ బిగించారు.