యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత రంగానికి జీవం పోశారు. ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త కొత్త పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల మృతదేహాల సాక్షిగా రాజకీయాలు చేసిన పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. చేనేతతోపాటు పవర్లూమ్ నేతన్నలకు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నది. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చి నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా ఒకేసారి వందల కోట్ల బడ్జెట్ కేటాయించి అమలు చేస్తున్నది. అనేక రకాలుగా ప్రభుత్వం ఆదుకోవడంతో నేత కార్మికుల మోముల్లో ఆనందం కన్పిస్తున్నది.
సబ్సిడీలతో చేనేత మిత్ర..
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ చేనేత. అనాది నుంచి ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్న చేనేత గత పాలకుల నిర్లక్ష్యంతో చేనేత మగ్గం సడుగులు తెగి, నడుములు విరిగిపోయి చతికిల పడింది. ఇక కనుమరుగు అవుతుందేమో అనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో పూర్వ వైభవం తీసుకొచ్చారు. అందులో భాగంగా చేనేత మిత్ర పథకం తీసుకొచ్చారు. అర్హులైన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నూలు, రసాయనాలపై 40శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఈ పథకం కింద జిల్లాలో 15,989 మంది కార్మికులకు రూ.8.52 కోట్ల సబ్సిడీ అందింది.
జీఎస్టీ భారం మోపుతున్న కేంద్రం
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం జీఎస్టీ పేరుతో నేతన్నపై భారం మోపుతున్నది. ఇప్పటికే 5శాతం జీఎస్టీ పిండుకుంటుండగా, దాన్ని 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో వచ్చిన నాలుగు రూపాయలు కేంద్రం జేబుల్లోకి వెళ్లనున్నాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కానీ.. ఎప్పటికైనా కేంద్రం అమలు చేస్తుందని, దాన్ని తిప్పికొట్టాలని చేనేత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
పొదుపు పథకంతో ఆర్థిక సాయం..
నేత కార్మికుల కోసం నేతన్నకు చేయూత పేరుతో ప్రభుత్వం మరో స్కీం తీసుకొచ్చింది. ఈ పథకంలో సొసైటీల్లో సభ్యత్వం ఉన్న కార్మికులు ఎవరైనా రూపాయి నుంచి వెయ్యి వరకు ఏదైనా బ్యాంక్లో ప్రతి నెలా పొదుపు చేసుకుంటే.. వాటికి రెట్టింపు డబ్బు జమ చేసి మూడేండ్ల తర్వాత అందిస్తారు. గతంలో 5,442 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకోగా, రూ.21 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 10,655 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.20 కోట్లు మంజూరు చేసి, కార్మికుల పొదుపు ఖాతాల్లో జమ చేసింది. మర మగ్గాలకు కూడా పొదుపు పథకం వర్తింపజేస్తున్నారు. 278మంది కార్మికులకు రూ.33లక్షలు జమ చేశారు. ఈసారి 178 మంది నమోదు చేసుకున్నారు.
రూ.5లక్షల నేతన్న బీమా పథకం..
రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా లెక్క నేతన్న బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన జీఓ ఇప్పటికే విడుదలైంది. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఈ పథకం ద్వారా చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ కార్మికులు ఏ కారణంతో మరణించినా రూ.5లక్షల బీమా అందనుంది. ఎల్ఐసీ ద్వారా అమలు చేయనున్న ఈ బీమాకు 18 నుంచి 59 ఏండ్ల వయసున్నవారు అర్హులుగా నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు.
మరికొన్ని కార్యక్రమాలు..
చేనేత కళాకారుల వ్యక్తిగత రుణ మాఫీ కింద 2,420 మంది చేనేత కళాకారులకు రూ.8.56కోట్ల లబ్ధి చేకూరింది.
జిల్లాలో అదనంగా 1106 మగ్గాలకు తాత్కాలిక జియో ట్యాగ్ నంబర్లు కేటాయించారు.
178 తాత్కాలిక మరమగ్గాలకు జియో ట్యాగ్ నంబర్లు వేశారు.
మర మగ్గాల ఆధునీకరణ పథకం కింద 349 దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా క్యాష్ క్రెడిట్ మంజూరుకుగాను 10 సంఘాలకు రుణ పరిమితి రూ.4.6 కోట్లను రెన్యూవల్ చేశారు.
చేనేత లక్ష్మి పథకంతో మూతబడిన సహకార సంఘాలు మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటున్నాయి.
చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుల్లో కొత్త వెలుగులు నింపింది. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్నది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ముడి సరుకుల కొనుగోలు, విక్రయాలకు చేయూతనందిస్తున్నది. నూలు, రసాయనాలు, రంగులపై సబ్సిడీలు ఇస్తున్నది. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నది.
– బల్ల రాజు, చేనేత కార్మికుడు, భువనగిరి
చేనేతకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కొన్నేండ్లుగా కుదేలైన చేనేత పరిశ్రమకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన చేనేత సంక్షేమ పథకాలు బాసటగా నిలుస్తున్నాయి. రూ.5లక్షల బీమాతో కార్మికులకు వృత్తిపై మరింత భరోసా వచ్చింది. యారన్కు 40శాతం సబ్సిడీ కల్పించడం సంతోషకరం. వస్ర్తాల మార్కెట్పై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది.
– గంజి లింగేశ్వర్, చేనేత కార్మికుడు, నేలపట్ల, చౌటుప్పల్ మండలం