యాదాద్రి, జూలై 12 : స్వయంభూ ప్రధానాలయంలో మంగళవారం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం శ్రీస్వామివారికి తిరువారాధనలు చేపట్టి, ఆరగింపు నిర్వహించారు. నిజాభిషేకం నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయంలోని ఉత్తరదిశలోని మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, లక్ష్మీనరసింహుల నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులచే జరుపే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింది దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
స్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి, తమలపాకులతో అర్చన చేపట్టారు. లలితాపారాయణం చేశారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. వివిధ విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.26,10,860 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
అందుబాటులో ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ టికెట్లు
ఈ నెల 29న శ్రావణమాసం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో నిర్వహించే ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ టికెట్లు దేవస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది. కుంకుమార్చనలో పాల్గొనే దంపతులు కౌంటర్లలో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని ఈఓ ఎన్.గీత తెలిపారు. ఒక్కో టికెట్ ధర రూ. 2,000 ఉంటుందన్నారు. కోటి కుంకుమార్చన నిర్వహించేందుకు ప్రధానాలయంలోని ఉత్తర, దక్షిణ భాగం మొదటి ప్రాకార మండపాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం 30 మంది రుత్వికులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజుకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కోటి కుంకుమార్చన నిర్వహించనున్నామన్నారు.