యాదాద్రి, జూలై 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో గల ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల లాలిపాటలు పాడారు. నారసింహుడికి నిత్యారాధనలను అర్చక బృందం ఘనంగా నిర్వహించారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు.
స్వామివారి తిరువారాధన చేపట్టిన అనంతరం ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉద యం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఆర్జిత పూజలు కోలాహలంగా నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపి లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 11,18,889 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.