నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
దొంగతనాలు, అక్రమాలకు అడ్డుకట్ట
ఆలేరు రూరల్, మార్చి 12 : సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట పడుతున్నది. నేర ప్రవృత్తి ఉన్న వారిని పట్టుకోవడంతోపాటు నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. నేరాల నియంత్రణపై పోలీసులు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించి వాటి ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. దాంతో ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన సీసీ కెమెరాలు నేడు పల్లెల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు.
ఆలేరు మండలంలోని గుండ్లగూడెంలో సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్రెడ్డి సొంత నిధులతో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మానిటర్కు అనుసంధానం చేశారు. దాంతో నిఘా పెరిగి గ్రామంలో జరిగే దొంగతనాలు, గ్రామానికి ఎవరు వస్తున్నారు, వెళ్తున్నారనే విషయాలు తెలుస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో సీసీ ఫుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. చైన్ స్నాచింగ్, ట్రిపుల్ రైడ్, ఓవర్ లోడ్, అతివేగంతో వాహనం నడు పడం తదితర విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా వాటిపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
24 గంటలూ పటిష్ట చర్యలు
గ్రామంలోని 4 ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా నిత్యం సీసీ టీవీలో పర్యవేక్షిస్తూ అపరిచితులు ఎవరైనా గ్రామంలోకి వస్తే వారి వివరాలు, ఆధార్ నంబర్ తీసుకుంటున్నాం. గ్రామంలో చోరీలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
–ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, సర్పంచ్
అన్ని గ్రామాల్లోనూ కెమెరాలు పెట్టిస్తాం
ఆలేరు మండలంలో 14 గ్రామపంచాయతీలు ఉండగా 10 గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. మిగతా గ్రామాల్లోనూ త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
–ఇద్రీస్ అలీ, ఎస్ఐ, ఆలేరు