జిల్లాకు అందించేందుకు ప్రణాళికలు
నిత్యం100 ఎంఎల్డీ నీటిని తరలించేలా
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి సాకారం!
యాదాద్రి అవసరాల కోసం గండిచెరువులోకి నీటిని మళ్లించే ఏర్పాట్లు
జిల్లా సాగు, తాగునీటికి ఆధారంగా నిలువనున్న మల్లన్న సాగర్
యాదాద్రి భువనగిరి, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మిషన్ భగీరథ పథకంలో గోదావరి నీళ్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధవుతున్నాయి. సిద్దిపేటతోపాటు జనగామ, మేడ్చల్, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నీటిని సరఫరా చేయనుండగా.. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నిత్యం 100 ఎంఎల్డీ నీటిని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహుళ ప్రయోజనాల మల్లన్న సాగర్ నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయనుండగా, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇన్నా ళ్లు నీళ్లకోసం కనాకష్టం పడ్డ కరువు నేల సాగు, తాగునీటి సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందనుంది. ఇక యాదాద్రి ఆలయ అవసరాల కోసం గండి చెరువుకు గోదావరి నీళ్లను తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తాగునీటికి భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి సరఫరా చేసేలా సీఎం కేసీఆర్ పటి ష్ట ప్రణాళికతో ముం దుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే మల్లన్న సాగర్ నుంచి యా దాద్రి భువనగిరి జిల్లాలో మిషన్ భగీరథ పథకానికి నీరందించే దిశగా అడుగులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే మల్లన్న చెంతనే ఉన్న 540 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిద్ధ్దమవుతున్నది. ఇక్కడి నుంచే యాదాద్రి భువనగిరి జిల్లాకు తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయనున్నారు.
తాగు, సాగు నీటికీ మల్లన్న సాగరే..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీటి పరంగానే కాకుండా తాగునీటికి సైతం ఆధారం కానుంది. భవిష్యత్తులో నృసింహ (బస్వాపూర్) రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తుండగా.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు మిషన్ భగీరథ పథకం లో గోదావరి, కృష్ణా నీటిని అందిస్తున్నారు. హెచ్ఎండబ్ల్యూస్ ద్వారా ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి 12 మండలాలకు గోదావరి నీళ్లు సరఫరా అవుతున్నాయి. భువనగిరి నియోజకవర్గంతోపాటుచౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాలకు ఎస్ లింగోటం ఫిల్టర్ బెడ్ నుంచి రామన్నపేట, మో త్కూరు, అడ్డగూడూరు మండలాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటి సరఫరా జరుగుతున్నది మిషన్ భగీరథ కోసం ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లే పైపులైన్నే వాడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలోని ఘన్పూర్ వద్ద నిర్మించిన డబ్ల్యూటీపీ నుంచి తాగునీటి అవసరాలకు ట్యాపింగ్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు పంపుతున్నారు.హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వచ్చే నీటిలో కొరత ఏర్పడినప్పుడు ఇబ్బందులు తలెత్తుతుండడంతో మల్లన్న సాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని నిర్ణయించారు.
భవిష్యత్ అవసరాల కోసం..
హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా జిల్లాలోని 12 మండలాలకు నిత్యం 70 ఎంఎల్డీ నీరు అవసరం కాగా.. ప్రస్తుతం 45 ఎంఎల్డీ మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీనివల్ల యాదగిరిగుట్ట, భువనగిరి పట్టణాలకు సరఫరా చేసే నీటిలో కోత విధించుకోవాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో మిషన్ భగీరథ స్ఫూర్తికి అవరోధం ఏర్పడే అవకాశం ఉండనుండడంతో ఈ సమస్యకు మల్లన్న సాగర్ శాశ్వత పరిష్కారం చూపనున్నది. హైదరాబాద్ లైన్పై భారం కూడా తగ్గనున్నది. మల్లన్న సాగర్ నుంచి నీటిని తాగునీటి అవసరాలకు తరలించేందుకు 2.4 డయామీటర్ల వ్యాసార్థంతో పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు.
శామీర్పేట్కు దగ్గరలోనే ఉన్న మసీద్గూడ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర కొత్తగా పైపులైన్ను వే యాల్సి ఉంటుందని, అక్కడి నుంచి గతంలో వేసిన పైపులైన్ ద్వారానే జిల్లాకు నీటిని తరలించవచ్చని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వా రా నీరందిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని 12 మండలాలకే మల్లన్న సాగర్ ద్వారా నీరందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, వచ్చే ఏడాది మే, జూన్ నాటికి ఇది సాకారంలోకి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తుకు అనుగుణంగా మల్లన్నసాగర్ నుంచి నిత్యం 100ఎంఎల్డీ (10 కోట్ల లీటర్లు)నీటిని జిల్లాకు తరలించేలా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంచినట్లు వారంటున్నారు. మరోపక్క యాదాద్రి ఆలయ అవసరాల కోసం మల్లన్న సాగర్ నీళ్లను వినియోగించుకునేందుకు గండి చెరువుకు గోదావరి నీళ్లను తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.