నాబార్డ్ డీడీఎం వినయ్కుమార్
బొమ్మలరామారం, మార్చి 11 : మహిళా రైతులు ఆర్థికంగా ఎదగడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని నాబార్డ్ డీడీఎం వినయ్కుమార్ అన్నారు. మండలంలోని చీకటిమామిడి రైతు వేదికలో శుక్రవారం గ్రామీణ మహిళా మండలి అధ్యక్షురాలు విజయలక్ష్మి, ధీశాలి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా రైతులకు వ్యవసాయంలో లాభాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రైతులు సమిష్టి వ్యవసాయం చేసి, మద్య దళారులు లేకుండా నేరుగా తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవాలని సూచించారు. రైతులకు కూరగాయలు అమ్ముకోవడానికి రూరల్ మార్ట్ల ఏర్పాటు, ప్రాసెస్ యూనిట్లు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు రుణాలు అందిస్తామన్నారు. ఎస్టీ రైతులకు గిరివికాస్ పథకం ద్వారా ఉచితంగా బోరు వేసి మోటారు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, వ్యవసాయ శాస్త్రవేత్త లీలారాణి, ఏఓ దీప్తి, ధీశాలి మహిళా రైతు సమాఖ్య అధ్యక్షురాలు పల్లె మంజుల, సుజాత, అండాలు, లక్ష్మి, వరలక్ష్మి, చంద్రకళ పాల్గొన్నారు.