రాత్రి సింహవాహనారూఢుడిగా దర్శనం
నేడు ఎదుర్కోలు
యాదాద్రి, మార్చి 9;వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆరో రోజైన బుధవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భాగంగా బుధవారం లక్ష్మీనరసింహ స్వామిని గోవర్ధన గిరిధారిగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు. ఉత్సవ మండపంలో చతుర్వేదాలు, మూల మంత్రాలు, మూర్తి మంత్రాలు, హోమాలు, సుదర్శన మహా మంత్రం, నారసింహ మహా మంత్రం, పంచసూక్తాలు, నిత్య లఘు పూర్ణాహుతి, నిత్య పూర్ణాహుతి, వేదాలు, పారాయణాలు,. ఇతిహాసాలు గావించారు. పాశుర పఠణాలను పఠిస్తూ రుత్వికులు, అర్చకులు ముందు నడుస్తుండగా, భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవంగా తిరువీధిసేవ సాగింది. అనంతరం గర్భాలయానికి ఎదురుగా అలంకార మూర్తిని అధిష్ఠింపజేసి ఆలయ ప్రధానార్చకులు గోవర్ధన గిరిధారి విశిష్టతను భక్తులకు వివరించారు.
సింహ వాహనంపై ఊరేగిన యోగానంద నరసింహ స్వామి
దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణకు నృసింహుడిగా అవతరించిన స్వామి వారు బుధవారం రాత్రి మృగరాజు సింహ వాహనంపై యోగానందుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. పట్టు వస్ర్తాలు, ముత్యాలు, బంగారం ఆభరణాలతో తేజోరూపుడైన నరసింహుడిని అడవికి రాజైన సింహ వాహనంపై అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రుత్వికుల పారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో స్వామివారు ఊరేగారు. ఆలయ అర్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు గజవెల్లి రమేశ్బాబు, దోర్బాల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
ధైర్య, పరాక్రమాలకు ప్రతీక
సింహం కార్యదీక్ష, బుద్ధి కుశలత, పరాక్రమం, ధైర్యం, గాంభీర్యాది గుణాలకు ప్రతీక అని ప్రధానార్చకులు తెలిపారు. లక్ష్మీనరసింహుడు హిరణ్య కశ్యపుడిని వధించి, సత్యగుణం కలిగిన ప్రహ్లాదుడిని రక్షించాడు. సింహం అరణ్యానికి సంరక్షకుడని, మాన జీవనం అనే సంసారక అర్యణ్యానికి సంరక్షకుడిని తానేనని నరసింహ రూపధారియైన స్వామి వారు సింహవాహనారూఢుడై భక్తులకు దర్శనమిస్తున్నాడని అర్చకులు వివరించారు.
కృష్ణ భగవానుడి అద్భుత లీల
శ్రీకృష్ణ పరమాత్ముడి బాల్యంలో అపూర్వమైన లీల గోవర్ధన గిరిధారి అని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పేర్కొన్నారు. ‘నంద వ్రజములోని గోపకులు పంటలు వృద్ధి చెందడానికి గోవర్ధన పర్వతం మీద వర్షాలు కురిపించాలని ఇంద్రయాగాన్ని ఆచరిస్తుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రయాగాన్ని నిలిపివేసి గోవులు, బ్రాహ్మణులు, పర్వతాలను పూజించాలని చెప్పగా గోపకులు అచలవ్రతం ఆచరిస్తారు. దానికి కోపగించిన ఇంద్రుడు నంద వ్రజముపై భీకరమైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. దానికి గోపకులు భయపడి శ్రీకృష్ణుడిని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ వారికి అభయమిచ్చి ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గొడుగులా ఏడురోజులు ఎత్తి పట్టుకొని గోవులు, గోపకులను రక్షిస్తాడు. శ్రీకృష్ణుడి మహత్యం తెలిసిన ఇంద్రుడు గర్వాన్ని వదిలి శరణాగతుడై గోవిందుడు అను బిరుదునిచ్చి నిష్క్రమిస్తాడు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అంటే స్వామివారిని శరణు వేడితే తప్పక రక్షిస్తాడు’ అని ప్రధానార్చకుడు వివరించారు.
నేడు ఎదుర్కోలు
లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా గురువారం ఉదయం జగన్మోహిని అవతారంలో యాదాద్రీశుడు దర్శనమివ్వనున్నారు. రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవలో ఊరేగనున్నారు. అనంతరం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
ఈసారి స్వర్ణ రథం..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సారి స్వామివారు స్వర్ణ రథంలో ఊరేగనున్నారు. దివ్య విమాన రథోత్సవానికి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీలోగిలి డెవలపర్స్, ల్యాండ్మార్క్ వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో బంగారంతో చేసిన రథ విడి భాగాలను అందించారు. వాటికి బుధవారం ఆలయ ఈఓ ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. నేడో రేపో స్వర్ణ రథాన్ని సిద్ధం చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వర్ణ రథంలో పొందుపర్చనున్న లక్ష్మీనరసింహ స్వామి ప్రతిమలు, గరుడ ఆళ్వారు, ఆంజనేయ విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి.
నిత్యాన్నదానం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు నిత్యాన్నదానం కొనసాగుతున్నది. దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన జీయర్ కుటీర్లో చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు వెల్లడించారు.