భువనగిరి కలెక్టరేట్, మార్చి 9 : కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ ఎస్.వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బూస మహేశ్ హైదరాబాద్లోని కాచిగూడలో బ్యాగులు, పర్సులు అమ్మేవాడు. వ్యాపారం సరిగా నడవకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని తన స్నేహితుడు షేక్ అజ్మత్తో కలిసి డిచ్పల్లికి చెందిన పాషా అనే గంజాయి విక్రయించే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. గంజాయి తీసుకొచ్చి ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని పాషా చెప్పడంతో అప్పటికే మహేశ్కు పరిచయం ఉన్న రాజు, శ్రీను అనే గంజాయి సప్లయర్స్కు ఫోన్ చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మొత్తుకుల సతీష్కుమార్గౌడ్ కారులో ముగ్గురు కలిసి భద్రాచలం నుంచి డిచ్పల్లికి గంజాయిని తరలిస్తుండగా భువనగిరి వద్ద పట్టుబడ్డారు. నంబర్ లేని బాలెనో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కారులో 1600 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి గంజాయితోపాటు 3 సెల్ఫోన్లు, 5 వేల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.