భువనగిరి అర్బన్, మార్చి 9 : రాష్ట్రంలోని గొల్ల కురుమల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. మండలంలోని బస్వాపురంలో కృష్ణయాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు గొల్లకుర్మలకు అందేలా కృషి చేస్తానని చెప్పారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం 12 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం కృష్ణయాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానించి మెమెంటో అందజేశారు. కవి, రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య, ఎంపీపీ నిర్మల, సర్పంచ్ కస్తూరి మంజుల, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రయ్య, చంద్రమ్మ, బాలరాజు, మధు, మల్లేశ్, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.