యాదాద్రి, మార్చి 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు పెండ్లి కుమారుడిగా ముస్తాబయిన స్వామివారు శ్రీకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. యాదాద్రీశుడి నిత్యపూజా కైంకర్యం యథావిధిగా జరిగిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు అంత్యంత వైభవంగా వేతమంద్ర పఠనాలు, మూలమంత్రం, మూర్తి మంత్ర హోమాలు జరిపారు. సర్వాంగ సుందరంగా శ్రీమన్నారాయణుడి పూర్వ అవతారమయిన శ్రీకృష్ణాలంకారంలో యాదాద్రీశుడిని తీర్చిదిద్దారు. వేద పురాణ, ఇతిహాస ప్రవచనాలను స్తుతించారు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి మహోత్సవం, బాలాలయ మండపంలో స్వామివారి ఊరేగింపు సేవ అత్యంత వైభవంగా చేపట్టారు.
పొన్నవాహన స్వరూపం..
పొన్న వృక్షాన్ని దేవ వృక్షంగా పురాణాలు పేర్కొన్నాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. పొన్న వృక్షాన్ని కల్పవృక్షమని అంటారు. ‘కల్పయతి వాంఛిత మితి’ అనగా కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు అని అర్థం. శ్రీకృష్ణావతారంలో స్వామి నిత్యం వసించిన పొన్నవృక్షం భగవత్ భక్తిని నింపి భగవత్ గుణాలను పరిమళింపజేసినందున ఈ వృక్షం భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనట్లు ఆర్యోక్తి. సకల చరాచర జగత్తంతా మహావృక్షం వంటిది. అలాంటి సంసారమనే మహా వృక్షానికి బీజం పరమాత్మ ప్రకృతిలోని ప్రతితత్వం పరమాత్మకు చెందినదేనని ‘భక్తాభీష్ట వరప్రదాయని అయిన స్వామివారు పొన్నవృక్షారూఢుడై భక్తులను దర్శనమిచ్చాడని ఆలయ ప్రధానార్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్, దోర్బాల భాస్కర్ శర్మ పాల్గొన్నారు.
పొన్నవాహన సేవలో స్వామివారు..
భక్త పారాయణుడు, జగత్ రక్షకుడు, శ్రీమహా విష్ణువు లోక కల్యాణార్థం అవతరించిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో దివ్య వాహన సేవలు అందుకుంటున్నాడు. రాత్రి బాలాలయంలో స్వామివారి నిత్యకైంకర్యాల అనంతరం ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు స్వామివారిని పొన్న వాహన సేవలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. మండపంలో స్వామివారి సేవను బాలాలయ ముఖ మండపంలో అధిష్ఠించి వేదమంత్రాలు పఠించారు.
శ్రీకృష్ణ దర్శనం సమస్త ప్రాణకోటికి మోక్షం
‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ భక్త పరాధీనత కలిగిన పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ‘కర్షతి చిత్తమ్’ అందరి మనస్సులను ఆకర్షించడంతోపాటు ఆనందిపజేయుట ఈ అవతారంలో ప్రయోజనమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పరమాత్మ తన వేణుగానం చేత అందరినీ పరవశింపజేసి, జీవులను ఆనందింపజేసి, రక్షించి, అనుగ్రహించిన తీరు ఈ మురళీకృష్ణ లీలలో కనిపిస్తున్నదన్నారు. మురళీ అనగా వేణువు. వేణువు నుంచి వెలువడు నాదం వేదమని, శృతులని, స్మతులని అవే భగవానుని చేరేందుకు పరమ సాధనములనే సంకేతాలను అందిస్తుందని లీలాశుకుల వారు పేర్కొన్నారు. మానువులనే కాదు జీవకోటిని, ప్రకృతిని తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరినీ రక్షించెందను అని స్వామి వారు నేడు ఈ అలంకార సేవలో దర్శనమిస్తున్నాడని అర్చకులు పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారిని ఉదయం 11 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి 9 గంటలకు సింహవాహన సేవ ఊరేగింపు ఉంటుంది.
ఆలయ ఈఓకు సన్మానం..
ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బాలాలయంలో ఆలయ ఈఓ ఎన్. గీతకు ఆలయ ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, దోర్బాల భాస్కర్శర్మ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈఓ ఎన్. గీత ఆలయంలోని మహిళా ఉద్యోగులు, మహిళా ఎస్పీఎఫ్ సిబ్బందిని సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు.