కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్నది. రాష్ట్ర రాజధానికి చెంతనే ఉండడంతో ఉద్యోగులు, ఇతర వర్గాల రాకపోకలు ఎక్కువగా ఉంటుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపడుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడంతోపాటు 45 ఏండ్లకు పైబడినవారిని గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వడంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి యాక్షన్ప్లాన్ను రూపొందించిన వైద్య ఆరోగ్యశాఖ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు నెలాఖరులోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అధికారులకు బాధ్యతలు అప్పగించి అవగాహన కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా, ఇక్కడ విజయవంతమైతే ఇతర జిల్లాలోనూ ఇదే వ్యూహాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ మరోసారి పంజా విసురుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ బారిన పడిన వారిలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వైరస్ సోకిన వారిని గుర్తించడం కష్టమవుతోంది. గత యేడాది కరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని కళ్లారా చూసిన ప్రజానీకం గతం నుంచి గుణపాఠాన్ని మాత్రం నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం భయం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం ఆవరించిన కారణంగా వైరస్ వ్యాప్తి ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వైరస్పై యుద్ధం చేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కొంప ముంచుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచి, వీలైనంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో వ్యాక్సినేషన్ చేపట్టి సక్సెస్ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉపక్రమించింది. ఇందుకుగాను మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, పారిశుధ్యం తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని నిర్ణయించుకుని గత కొద్దిరోజులుగా ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అనితారామచంద్రన్ గూగూల్ మీట్ నిర్వహిస్తున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే వివిధ శాఖల సిబ్బందితోనూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇదీ యాక్షన్ ప్లాన్
జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం కోసం మైక్రో ప్లాన్ను రూపొందించారు.
జిల్లా జనాభా 7,94,000 ఉండగా.. వీరిలో 60 ఏండ్లకు పైబడిన వారు 63,519(8 శాతం) మంది, 45 ఏండ్లకు పైబడిన వారు 83,372(10.5 శాతం) మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వీరిలో కనీసం 80 శాతం మందికైనా ఈ నెలాఖరు లోపు వ్యాక్సినేషన్ను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు.
జిల్లా కేంద్ర దవాఖానతోపాటు 2 సీహెచ్సీలు, 20 పీహెచ్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పీహెచ్సీలో నిత్యం వంద వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా టెస్టుల సంఖ్యను పెంచుతున్నా రు. ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక నుంచి నిత్యం ప్రతి పీహెచ్సీ పరిధిలో 300 టెస్టు లు, సీహెచ్సీలల్లో 500 చొప్పున టెస్టులు చేయనున్నారు.ఈ లెక్కనరోజుకు 7వేల టెస్టులు చేయ నున్నారు. అలాగే.. ప్రతి పీహెచ్సీలో 400 మంది కి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.
ప్రతి మండలంలో ఎంపీడీవోలు కీలకపాత్ర పోషించనున్నారు. మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతానికి ముందుకు వెళ్లనున్నారు. ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్లను నియమించగా..పర్యవేక్షణకోసం ప్రతి నాలుగైదు పీహెచ్సీలకు ఒక ప్రోగ్రాం ఆఫీసర్ను నియమించారు.
ప్రజాప్రతినిధులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి కరోనా టెస్టులతోపాటు, వ్యాక్సినేషన్ కోసం ప్రజలను కేంద్రాలకు తీసుకొచ్చేలా ప్రతి మండలంలో, మున్సిపాలిటీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పాజిటివ్ వచ్చిన వారి వివరాలు, వారితో కాంటాక్టులో ఉన్నవారి వివరాలను యాప్లో పొందుపర్చి పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందించేలా ప్రతి పీహెచ్సీలో అవసరమైన వాటిని అందుబాటులో ఉంచారు.
జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్న భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతానికి 459 వరకు యాక్టివ్ కేసులు ఉండగా.. వీరు ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అత్యవసర చికిత్స కోసం బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి ఏరియా దవాఖానల్లో ఏర్పాట్లు చేసి ఉంచారు.
ముఖ్యంగా మాస్క్లు ధరించడంపై చైతన్య పర్చేందుకు పోలీస్ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. విధిగా మాస్క్లు ధరించేలా జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీస్శాఖ ఉపక్రమించనున్నది.
పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేస్తాం
కరోనాను కట్టడి చేయడంతోపాటు 45 ఏండ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. మైక్రోప్లాన్లో భాగంగా 45 ఏండ్లకు పైబడిన వారందరికీ ఈ నెలాఖరులోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆధ్వర్యంలో విస్తృతంగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిత్యం జిల్లా వ్యాప్తంగా ఏడువేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల సహకారంతో పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేస్తాం.