యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బుధవారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు.
ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం జరిపారు. తొలిపూజల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దుచేశారు.
ఫిబ్రవరి 18 న స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురార్పణ.. ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ. ఫిబ్రవరి 20న ఉదయం మత్స్యావతార అలంకారం, సాయంత్రం శేష వాహన సేవ వేదపారాయణములు, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ.. ఫిబ్రవరి 21 న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ.. ఫిబ్రవరి 22న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ… ఫిబ్రవరి 23న ఉదయం గోవర్ధన గిరి ధారి, సాయంత్రం సింహ వాహన సేవ.. ఫిబ్రవరి 24 న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనంపై రాత్రి ఎదుర్కోలు వేడుక.. ఫిబ్రవరి 25 న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం.. ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం.. ఫిబ్రవరి 27న స్వామి వారి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న గర్భాలయంలోని మూలవర్యులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.