10న ఎదుర్కోలు.. 11న స్వామివారి తిరుకల్యాణోత్సవం
14న శృంగార డోలోత్సవంతో పరిపూర్ణం
బాలాలయంలో చివరి బ్రహ్మోత్సవాలు
పాల్గొననున్న మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత
యాదాద్రి, ఫిబ్రవరి 28 ;యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4నుంచి 14వరకు బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. 11రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచరాత్రగమశాస్త్రం, భగవద్రామానుజ సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈఓ కార్యాలయంలో సోమవారం ఆమె వివరాలు వెల్లడించారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవ విశిష్టత
యాదాద్రీశుడి క్షేత్రంలో ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. పూర్వం స్వామి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని చెబుతుంటారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అని ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం జరుపుతారు.
స్వస్తివాచనంతో ఆరంభం..
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఈ నెల 4వ తేదీ స్వస్తి ప్లవనామ సంవత్సర పాల్గుణ శుద్ధ విదియ శుక్రవారం రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 14న ఫాల్గుణ శుద్ధ ద్వాదశి సోమవారం రోజున డోలోత్సవంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో 60 నుంచి 70 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు , పండితులు పాల్గొననున్నారు.
కొండకింద స్వామి వారి తిరుకల్యాణం, రథోత్సవాలు నిలుపుదల యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ పునర్నిర్మాణాలు పూర్తయి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి 21నుంచి 28వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో జరిగే స్వామివారి తిరుకల్యాణోత్సవంతో పాటు దివ్య విమాన రథోత్సవాలను ఈ ఏడాది నిర్వహించడం లేదు. బాలాలయంలోనే స్వామివారి తిరు కల్యాణం, రథోత్సవం నిర్వహించనున్నారు.
మొక్కు సేవలు రద్దు..
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి కొండపైన గల బాలాలయంలో ఈ నెల 4నుంచి 14వ తేదీ వరకు నిత్యకల్యాణోత్సవం, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నారు. స్వామి వారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15నుంచి 9.00గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 10వ తేదీ నుంచి 12వరకు సాయంత్రం భక్తులచే నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉదయం భక్తులచే జరుపబడే అభిషేకం, అర్చనలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కల్యాణోత్సవంలో పాల్గొననున్న మంత్రులు, ప్రభుత్వ విప్..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బాలాలయంలో ఈ నెల 11న ఉదయం 11గంటలకు జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాల్గొననున్నారు.
పట్టువస్ర్తాల సమర్పణ..
లక్ష్మీనరసింహ స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమర్పించనున్నారు. ఆలయం తరపున ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త, టీటీడీ తరపున టీటీడీ ఆలయ ఈఓ, పోచంపల్లి చేనేత సంఘం, గద్వాల్, కొత్తకోట ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.
స్వామివారికి అలంకార సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వారం రోజుల పాటు అలంకార సేవలను నిర్వహించనున్నారు. 6వ తేదీ ఉదయం 11గంటలకు మత్స్యావతారం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ, 7న ఉదయం 11గంటలకు వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి 9గంటలకు హంసవాహన అలంకార సేవ, 8న ఉదయం 11గంటలకు కృష్ణాలంకారసేవ(మురళీకృష్ణుడు), రాత్రి 9గంటలకు పొన్నవాహన సేవ, 9వ తేదీన గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి 9గంటలకు సింహవాహన సేవ, 10వ తేదీన ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9గంటలకు అశ్వవాహనసేవ, బాలాలయం నందు స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, 11వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార సేవ(హనుమంత వాహన సేవ), రాత్రి 11 గంటలకు గజవాహన సేవలో బాలాలయంలో తిరుకల్యాణ మహోత్సవం, 12వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీమహావిష్ణ అలంకార సేవ(గరుఢ వాహన సేవ)లను నిర్వహించనున్నారు.
యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామికి సోమవారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామూన సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో పురోహితులు పరమశివుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాలతో కలిపి స్వామివారికి రూ. 10,81,639 సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే అఖండ జ్యోతి పాదయాత్ర మంగళవారం హైదరాబాద్లోని బర్కత్పుర నుంచి ప్రారంభంకానుంది.
యాదాద్రి స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన వీపీఆర్ కన్స్ట్రక్చన్స్ రూ.10లక్షలు, హైదరాబాద్కు చెందిన హరిక్రిష్ణన్రావు-శ్రీలత దంపతులు రూ.30 గ్రాముల బంగారం, కర్మన్ఘాట్కు చెందిన ప్రసాద్-సునీత దంపతులు రూ.51వేలు, పాతగుట్ట స్థానార్చకులు మరింగంటి యాదగిరిస్వామి సంస్మరణార్థం ఆయన కుమారుడు మరింగంటి కృష్ణమాచార్యులు లక్ష రూపాయల చెక్కును యాదాద్రిలో ఆలయ ఈఓ గీతకు అందజేశారు.