నారాయణపురం, మే 28 : కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 గంటలకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచి 10 గంటల లోపు వ్యాపారులు మూసివేశారు. 10 గంటల తరువాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ సుధాకర్రావు ఆధ్వర్యంలో గుడిమల్కాపురం చెక్పోస్టు వద్ద వాహనాలు తనఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
రామన్నపేటలో…
రామన్నపేట, మే 28 : ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకే వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వాహనాల తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేశారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 28 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయగా, ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పెట్రోలింగ్ వాహనాల ద్వారా గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.
ఆలేరు టౌన్లో…
ఆలేరు టౌన్, మే 28 : ఆలేరు పట్టణంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల తరువాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పట్టణంలో లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని ఎస్సై రమేశ్ కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అత్యవసర సేవలకు తప్పా మిగతా వాటికి అనుమతి లేదన్నారు.
రాజాపేటలో…
రాజాపేట, మే 28 : మండలంలో లాక్డౌన్ కొనసాగింది. ప్రజలు గడప దాటక పోవడంతో గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పొట్టిమర్రి చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనఖీలు నిర్వహించి అనుమతి లేని వాహనాలను సీజ్ చేశారు.
మోత్కూరు, గుండాల మండలాల్లో…
మోత్కూరు, మే 28 : మోత్కూరు, గుండాల మండలాల్లో లాక్డౌన్ కఠినంగా కొనసాగుతున్నది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో, మున్సిపాలిటీ కేంద్రంలో పోలీసులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. భువనగిరి, నల్లగొండ, తిరుమలగిరి రూట్ల నుంచి రాకపోకలను సాగిస్తున్న వాహనాలను కట్టుదిట్టం చేశారు. గుండాల మండల కేంద్రంలో జనగామ, దేవరుప్పుల, మోత్కూరు, ఆలేరు ప్రాంతాల నుంచి రాకపోకలను సాగిస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి సరైన పత్రాలులేని, కొవిడ్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు పెద్దఎత్తున ఇతర గ్రామాల నుంచి సరుకులకు వచ్చి దుకాణాల ఎదుట క్యూ కట్టడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు, వ్యాపారులు కొవిడ్ నిబంధనలను అనుసరించి దుకాణాలను నిర్వహించుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, మే 28 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు మండల ప్రజలంతా సహకరించాలని ఎస్సై డి. నాగరాజు అన్నారు. మండల వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. మండల కేంద్రంతోపాటు ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
లాక్డౌన్తో ఉదయం 10గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగరాజు తెలిపారు.