భూదాన్పోచంపల్లి, మే 28 : పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడి నిజం చేయడానికి తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో సత్ఫలితాలను ఇవ్వడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నది. ఒకనాడు అత్యంత వెనుకబాటుకు గురైన మండల పరిధిలోని పెద్దరావులపల్లి గ్రామం ఇప్పుడు పల్లెప్రగతితో మండలంలోనే ముందంజలో ఉన్నది. ఆ గ్రామ సర్పంచ్ మట్ట బాలమణీసుదర్శన్ గౌడ్ 2021 జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎంపిక కావడానికి దోహదం చేసింది. పద్దరావులపల్లి గ్రామంతోపాటు మామిళ్లగూడెం ఆవాస గ్రామంతో కలిపి మొత్తం 1,947 మంది జనాభా కాగా, 1,486 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ప్రస్తుతం 448 జాబ్కార్డులు, 205 పింఛన్లు అందుతున్నాయి. గ్రామంలో గత పాలకుల నిర్లక్ష్యం మూలాన అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురికాగా, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ మట్ట బాలమణీసుదర్శన్గౌడ్ చొరవతో గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.
గ్రామంలో సుమారు రూ.18లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మించుకోగా, ప్రజల ఇబ్బందులను తీర్చడానికి సుమారు రూ.10.7లక్షల వ్యయంతో వైకంఠధామాన్ని నిర్మించారు. రూ. 2.5లక్షలతో వర్మీకంపోస్టు యార్డును ఏర్పాటు చేసుకోవడంతోపాటు కంపోస్ట్ ఎరువును తయారు చేసి గ్రామంలో హరితహారంలో నాటిన సుమారు 10వేల మొక్కలకు దానిని వాడుకుంటున్నారు. ఇక గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామంలో మురుగునీటి వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. గ్రామ పరిపాలనా సౌలభ్యం కోసం రూ.5.8లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేయడంతోపాటు రూ.3.6లక్షలతో ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. అంతే కాకుండా గ్రామంలో రూ.22లక్షలతో రైతువేదిక నిర్మించగా, మరో రూ.9లక్షలతో బీసీ కమ్యూనిటీ హాలు నిర్మించారు.
సీసీ రోడ్లు.. మురుగునీటి కాల్వల ఏర్పాటు
గత 20 ఏండ్లుగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పెద్దరావులపల్లిలో తెలంగాణ సర్కారు ఏర్పాటు అయిన తరువాత సుమారు రూ.65లక్షలతో సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో అంతర్గత మురుగునీటి కాల్వల ఏర్పాటు పూర్తి అయ్యింది. మరింత అభివృద్ధికి మరో రూ.50లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ బాలమణి తెలిపారు. అయితే గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూడిక తీయగా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇక సుమారు రూ.15.4 లక్షలతో ఆర్అండ్బీ రోడ్ల మీద కల్వర్టుల నిర్మాణం, వన నర్సరీ ద్వారా గ్రామానికి అవసరమయ్యే మొక్కలను పెంచుకోవడంతోపాటు ప్రస్తుతం మరో 8వేల మొక్కలను సిద్ధంగా ఉంచుకున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారుగా 80శాతం వరకు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసి నేరాలను అధిగమించడంతోపాటు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి గ్రామంలో రూ.2.5లక్షలతో సుమారు 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతోపాటు గ్రామ పంచాయతీ నిధుల నుంచి అన్ని ఆవాసాలకు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయడానికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలను లేకుండా చేయడానికి ఎమ్మెల్యే సహకారంతో పెద్దరావులపల్లి, మామిళ్లగూడెంలో రెండు వేర్వేరుగా వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు.
ఉత్తమ సర్పంచ్గా ఎంపిక..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరవేయడంతోపాటు అభివృద్ధి నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకొని గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నందుకుగాను ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ సర్పంచ్గా పెద్దరావులపల్లి సర్పంచ్ మట్ట బాలమణీసుదర్శన్గౌడ్ను ప్రభుత్వం ఎంపిక చేయగా, జనవరి 26న జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితారామచంద్రన్ చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నది.