పల్లె నుంచి పట్నమోలే ఊరు
తీరిన అంతిమ యాత్రలో కష్టాలు
రూ.78లక్షలతో అభివృద్ధి పనులు
ఆకర్షణీయంగా పల్లెప్రకృతి వనం
బీబీనగర్, మే 20 : పల్లెలు ప్రగతికి చిహ్నాలుగా కన్పిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకెళ్తున్న అన్నంపట్ల గ్రామం ముందు వరుసలో ఉంటుంది. అన్నంపట్ల మండలంలోనే చిన్న గ్రామం. ప్రస్తుతం అతితక్కువ వ్యవధిలోనే అభివృద్ధి చెంది మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో ఆ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అనతి కాలంలో పంచాయతీలో సకల వసతులు సమకూర్చుకున్న ప్రస్తుతం ఆలోటు తీరింది. గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీకంపోస్టు ఎరువు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో రూ.13లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్నానాల కోసం పురుషులు, స్త్రీలకు వేర్వేరు గదులను ఏర్పాటు చేశారు.
రూ.2.50లక్షలతో డంపింగ్ యార్డు..
ఇక్కడి పంచాయతీలో రూ.2.50లక్షలతో డంపింగ్యార్డును నిర్మించారు. సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్టు ఎరువు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాక్టర్లో ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వేయడం వల్ల గ్రామమంతా శుభ్రంగా ఉంటున్నది. ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా సుఖజీవనం సాగిస్తున్నారు. అలాగే మిషన్భగీరథ నీటి సరఫరాకు రెండు ట్యాంకులను ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి సమస్య తీరడంతోపాటు ఆరోగ్యంగా ఉంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మారిన గ్రామ స్వరూపం..
గ్రామంలో 8 వార్డులు ఉండగా, 670 ఓటర్లు, 1080 మంది జనాభా ఉన్నది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.13 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో డంపింగ్యార్డు, రూ.13లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, ఎస్ఎఫ్సీ, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని కొనుగోలు చేశారు. హెచ్ఎండీఏ నిధులు రూ.25లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలంలో రహదారులు బురదమయంగా ఉండేవి. కానీ రోడ్లకు ప్రభుత్వం రూ.15లక్షల గ్రాంటులు విడుదల చేయడంతో వీధులన్నీ సుందరంగా మారాయి. సీసీ రోడ్లు నిర్మించి గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేశారు. అంతేకాకుండా గ్రామ పరిధిలోని నర్సరీల్లో పదివేల మొక్కలు, హరితహారంలో 4వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
దాతల సహకారం..
సర్పంచ్ బొక్క వసుమతీజైపాల్రెడ్డి తన సొంత నిధులు రూ.1.10 లక్షలతో గ్రామ పంచాయతీ ఫర్నీచర్, అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆట వస్తువుల ఏర్పాటుకు రూ.50 వేలతో సమకూర్చారు. దీనితోపాటు సర్పంచ్ ఆధ్వర్యం లో దాతల సహకారంతో గ్రామాన్ని నేర రహిత గ్రామంగా మార్చడానికి రూ.2.60లక్షలతో 16 సీసీ కెమెరాల ఏర్పా టు, రూ.38 వేలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెయింటింగ్కు సహకరించారు.