పెరుగుతున్న ప్రజల సగటు జీవిత కాలం
స్పష్టం చేస్తున్న కేంద్ర గణాంకశాఖ నివేదిక
స్పష్టం చేస్తున్న కేంద్ర గణాంక శాఖ నివేదిక
మారిన జీవన సంస్కృతే కారణమంటున్న నిపుణులు
కరోనా సంక్షోభం నేర్పిన సరికొత్త జీవిత పాఠం
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో పెను మార్పులు
2031-35 నాటికి 72 ఏండ్లకు పెరుగనున్న సగటు ఆయుర్ధాయం
‘జరిగేదంతా మంచికని.. అనుకోవడమే మనిషి పని’ అన్నాడు మనసు కవి ఆత్రేయ. కరోనా సంక్షోభం కూడా అంతేనని.. అది ప్రస్తుతానికి మనను ఎంత కష్టపెడుతున్నా.. దానివల్ల కూడా లాభాలున్నాయని సైకాలజిస్టులు సెలవిస్తున్నారు. విచ్చలవిడిగా తిరగకపోవడం..మారిన ఆహారపు అలవాట్లు..రెండేండ్లుగా జీవనశైలిలో వచ్చిన పెను మార్పులు మనల్ని మానసికంగా మరింత దృఢంగా చేస్తున్నాయి. అలాగే.. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తల కారణంగా ప్రజల సగటు ఆయుర్ధాయం కూడా పెరిగింది. రెండేండ్ల క్రితం వరకు 70 ఏండ్లే ఉండగా.. 2031-35 నాటికి పురుషుల సగటు ఆయుర్ధాయం 72 ఏండ్లు. మహిళల సగటు ఆయుర్ధాయం 75 ఏండ్లుగా ఉంటుందని ఇటీవల వెల్లడైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేస్తున్నది. 40- 50 ఏండ్లనాటి సంప్రదాయాలన్నీ ప్రస్తుతం ప్రజల మనసులను దోచుకుంటుండటంతో ఏడు పదులు దాటినా ఢోకా లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. – యాదాద్రి భువనగిరి, మే 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సాధారణంగా నా వయసు వారు జీవనశైలి మార్చుకునేందుకు ఇష్టపడరు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు పాత అలవాట్లను మార్చుకునేలా చేశాయి. గతంలో డైట్ను మార్చుకోవడానికి ఇష్టపడని నేను..నా నిర్ణయాన్ని మార్చుకున్న. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్న. వ్యాయామం కూడా చేస్తున్న.
– ఓ యువతి అభిప్రాయం
మారిన ఆహారపు అలవాట్లతో ఒకప్పటి గట్టితనం నేటి మనుషులకు లేకుండా పోయింది. మళ్లీ పాత రోజులు వచ్చి పూర్వపు సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సురక్షితమైన జీవితం వైపు అడుగులు వేస్తుండటం సంతోషించదగ్గ విషయం. ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేస్తుండటం శుభ పరిణామం.
– 60 ఏండ్ల వృద్ధుడి మనోగతం
యాదాద్రి భువనగిరి, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత కొన్నేండ్లుగా మనిషి జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఇక కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మరింతగా మార్పు లు సంభవించాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. దాదాపు అందరి జీవిన శైలి మారిపోయింది. ప్రజల జీవన విధానం.. ఆలోచన విధానం.. జీవితంపై దృక్పథం.. ఆఖరికి తినే ఆహారపు అలవాట్లలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్యంపై స్పష్టత వచ్చింది. పూర్వ సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ధైర్యాన్ని మరింత పెంచగా.. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాటుదేలేలా చేశా యి. ఆశాభావంతో బతుకుదెరువు సాగిస్తున్న తరుణంలో మనుషుల ఆయుర్థాయం పెరగడం శుభపరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు.’
పెరిగిన కొర్రన్నం.. గానుగ నూనెల వాడకం
‘ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే’ అని ప్రతి ఒక్కరూ భావిస్తున్న సందర్భమిది. చక్కని జీవనశైలి ఉంటే చక్కటి ఆరోగ్యం మన సొంతమవడం ఖాయమన్న ఆలోచనలు మనిషి మానసిక వైఖరిలో మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు పరిమితి కంటే ఎక్కువగా తినేవారు. ఫుడ్ విషయంలోనూ పెద్దగా పట్టింపులేక.. బయటి ఆహారాన్నే ఎక్కువగా తినేసేవారు. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఏది పడితే అది తినే పరిస్థితి పోయింది. ముడి బియ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతోపాటు జొన్న, రాగి సంకటి, కొర్రన్నం తదితర రకాలను ఆహారంలో భాగంగా వాడుతున్నారు. అన్నంకు బదులుగా ఒక పూట చిరు ధాన్యాలతోనే భోజనం కానిచ్చేస్తున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల రిఫైన్డ్ నూనెల వినియోగాన్ని తగ్గించి గానుగల నుంచి తీసిన నూనె వాడకం వైపు జనం మొగ్గు చూపిస్తున్నారు.
మిద్దె పంటల సాగుపై దృష్టి
కూరగాయలు, ఆకు కూరలు, ఆహార ధాన్యాల సాగులో రసాయన మందుల వాడకం పెరిగిపోయింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండటంతో జీవామృతం వంటి వాటితో సాగు చేస్తున్న పంట ఉత్పత్తులకే జనం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. చాలా వరకు వినియోగదారులు పొలాల వద్దకే వెళ్లి సాగు విధానం తెలుసుకుని మరీ కొంటున్నారు. ఇదే క్రమంలో మిద్దె పంటలపైన చాలా మంది దృష్టి పెడుతున్నారు. కొంతమంది ఇంటి పెరట్లో ఆకు కూరలు, కూరగాయలు, కొన్ని రకాల చిరు ధాన్యాలను సాగు చేస్తుండగా.. మిద్దెలు అనుకూలంగా ఉన్న వారు వాటిపైనే పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనాలు లేని.. తాజా కూరగాయలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
పెరిగిన రాగి చెంబులు.. మట్టి పాత్రల వాడకం
రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యకరమని పరిశోధనల్లోనూ రుజువు కావడంతో చాలామంది వీటినే వినియోగిస్తున్నారు. అలాగే మట్టి పాత్రల వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. మట్టిపాత్రలతో కుళాయిలు గతం నుంచే అందుబాటులోకి రాగా.. తాజాగా అన్నం వండటానికి, పాలు కాచేందుకు మట్టి పాత్రలనే వినియోగిస్తున్నారు. చాలా వరకు హోటళ్లల్లో స్పెషల్గా ఛాయ్ను కూడా మట్టి పాత్రలలోనే అందిస్తున్నారు. మొత్తంగా రోజువారీ వినియోగానికి ఉపయోగపడే పాత్రలన్నీ ప్రస్తుతం మట్టివే దర్శనమిస్తున్నాయి. నిజానికి అల్యూమినియం పాత్రకంటే.. మట్టి పాత్రల ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ..జనం వీటిపైనే మక్కువ చూపుతున్నారు. కొంతమంది ఆమెజాన్లో ఆర్డర్ పెట్టి ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు.
వ్యాయామంతో ఆరోగ్య జీవనంపై దృష్టి
ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలు, షికార్లు, పార్టీలు తగ్గగా..ప్రస్తుతం చాలామంది ఆరోగ్య జీవనంపై దృష్టి సారిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇప్పుడు వ్యాయామం నిత్యకృత్యంగా మారింది. కొంతమంది వ్యాయామంతో మరికొంతమంది క్రీడలతో శరీర దృఢత్వాన్ని పెంపొందించుకుంటున్నారు. యాప్స్, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల ద్వారా దొరికే సమాచారం..శిక్షకుల సూచనలతో వ్యాయామం, యోగా వంటి వాటిని సాధన చేస్తున్నారు. సైకిల్ తొక్కడం అన్ని వయస్కుల వారికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సైతం సూచిస్తుండడంతో చాలామంది సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. ఒకప్పుడు వందల్లో ఉన్న సంఖ్య నేడు వేలల్లోకి మారింది.
పెరిగిన మనిషి ఆయుర్థాయం
మారిన జీవన శైలి నేపథ్యంలో మనిషి సగటు ఆయుర్థాయం క్రమక్రమంగా పెరుగుతోంది. కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘దేశంలో మహిళలు, పురుషులు-2020’ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. 2014-18 కాలం లో సగటు జీవితకాలం 70 ఏండ్లు కాగా..కాలక్రమేణా ఏడు పదులు దాటినా.. ఢోకా లేని పరిస్థితులు రానున్నాయి. 2031-35 నాటికి పురుషు ల ఆయుర్థాయం 72 ఏండ్లు ఉండబోతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చేసిన సర్వే చెబుతున్నది. అయితే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని.. 203 నాటికి వారి జీవిత కాలం 75 ఏం డ్లుగా నమోదైనట్లు నివేదిక స్పష్టం చేస్తున్నది. నిత్య జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో మారిన జీవనశైలి.. మనుష్యుల్లో పెరుగుతున్న ఆత్మైస్థెర్యం వంటి పరిస్థితులే ఆయుర్థాయం పెరగడానికి కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఎనకటి రోజులు మళ్లొచ్చినయ్
రోజులు అప్పటిలాగా లేవు. ఎవరికి ఎప్పుడు ఏమైతదో తెలుస్తలేదు. కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. ఎనకటి పద్ధతులు పాటిస్తున్నారు. తిండి కాడ కూడా నిబంధనలు పెట్టుకుని తింటున్నరు. గివన్నీ మేం ఎనకటి నుంచే పాటిస్తున్నం. అప్పుడు..గిప్పుడు కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాం. కూరగాయలను కూడా ఇంట్లనే పండించుకుంట. ఆ గట్టితనంతోనే ఇప్పటికీ ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటున్నా. గత యేడాది వరకు కూలీ పనులకు కూడా వెళ్లేదాన్ని. గింత పోరగాడి నుంచి పెద్దోళ్ల వరకు గిప్పుడు పాటిస్తున్న పద్ధతులను చూస్తే మునుపటి రోజులు మళ్లొచ్చినయ్ అనిపిస్తున్నది. గిది గూడ మన మంచికే అనుకోవాలె.
మార్కెట్ల దొరికే కూరగాయలకు రకరకాల మందులు కొట్టి పండిస్తున్నరు. అవి తిని రోగాల బారిన పడుతున్నరు. మేం మార్కెట్లకు వెళ్లి కూరగాయలను కొనడం చాలా రోజుల కిందటే బంద్ చేసినం. ఓ మడిలో కూరగాయలనే పండించుకుంటున్నం. అవే తింటున్నం. ఇంట్లో ఖాళీ జాగలో కూడా కొన్ని రకాల కూరగాయలను పండిస్తున్నం. కరోనా వచ్చినంక మాలాగే చాలా మంది బయట నుంచి కూరగాయలను తెస్తలేరు. ఎవరి ఇంట్ల వాళ్లే పండించుకుంటున్నరు. లేదంటే పొలాల వద్దకే వెళ్లి తాజా కూరగాయలు తెచ్చుకుంటున్నరు. ఆరోగ్యం కోసం ఆమాత్రం జాగ్రత్తలు పాటించక తప్పడం లేదు.
-పిన్నింటి అమృత, నాగిరెడ్డిపల్లి, భుననగిరి మండలం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
వయస్సు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అందులోనూ కరోనా కాలంలో మంచి ఆహారమే ఆరోగ్యాన్ని కాపాడుతున్నది. రోజువారి ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. ముఖ్యంగా ఉదయం మొలకలు తినడంతోపాటు చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్ను ఎక్కువగా తీసుకుంటున్నా. రోజూ ఉదయం యోగా చేయడంతోపాటు కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నా. నాతో పాటు పది మందికి ఆరోగ్య సూత్రాలు వివరిస్తున్నా.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది
ప్రస్తుత కాలంలో అందరికీ తమ ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. దాదాపు అందరూ న్యూట్రీషియన్ ఆహారం తీసుకుంటున్నారు. మంచి ఆహార అలవాట్ల వల్ల ఇతర రోగాల బారినపడటం లేదు. ప్రతి ఒక్కరూ ఇదే జీవన శైలిని కొనసాగిస్తే భవిష్యత్లోనూ ఆరోగ్యంగా ఉంటారు.
-డాక్టర్ పాండురంగం, ప్రభుత్వ
దవాఖాన, చౌటుప్పల్