చౌటుప్పల్ , మే12: కరోనా ఉధృతి దృష్ర్టా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి చౌటుప్పల్ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు , ఇతర అవసరాలకు బయటికి వచ్చిన ప్రజలు..10 గంటల తర్వాత ఇండ్లలోనే ఉన్నారు.నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ కూరగాయల మార్కెట్ , తంగడపల్లి , చిన్నకొండూరు, వలిగొండ చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. చౌటుప్పల్ జాతీయ రహదారి బోసిపోయింది. సీఐ ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు.
మోత్కూరులో….
మోత్కూరు, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మోత్కూరు, గుండాల మండలాల్లో విజయవంతమైంది. ఉదయం ఆరుగంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు మేరకు నిత్యావసర దుకాణాలు తెరిచి ఆతర్వాత మూసివేశారు. మోత్కూరు, గుండాల మండల కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, అంబేద్కర్ చౌరస్తా నిర్మానుష్యంగా మారాయి.
రామన్నపేటలో..
రామన్నపేట, మే12: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మొదటిరోజు విజయవంతమైంది. 10గంటలకే వ్యాపారస్తులు స్వచ్ఛదంగా దుకాణాలను మూసివేశారు. గ్రామాల్లో సైతం ప్రజలు బయటికి రాక వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
సంస్థాన్నారాయణపురంలో..
సంస్థాన్నారాయణపురం,మే12: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి లాక్డౌన్కు సహకరించారు. పది గంటల తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఎస్సై సుధాకర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజాపేటలో …
రాజాపేట, మే 12: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో విజయవంతంగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి తెరిచి ఉంచిన దుకాణాలు 10 గంటల అనంతరం మూసివేశారు. దీంతో జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పొట్టిమర్రి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డాక్టర్ శివవర్మ తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 12: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని వ్యాపారులు, ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సరుకులను కొనుగోలు చేశారు. ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్సై ఎండీ.ఇద్రిస్అలీ మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.
భువనగిరిలో…
భువనగిరి అర్బన్ , మే 12 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండలం వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి వాణిజ్య , వ్యాపార సంస్థలు తెరిచి 10 గంటల తర్వాత మూసివేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకొని ఇండ్లలోకి చేరుకున్నారు. నిబంధనలు పాటించని షాపులు, మాస్కు లు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు రూరల్ పోలీసులు జరిమానా విధించారు.
ప్రశాంతంగా లాక్డౌన్
భువనగిరి టౌన్, మే 12 : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి అనంతరం మూసివేశారు.
బీబీనగర్లో…
బీబీనగర్, మే 12 : కరోనా నివారణలో భాగంగా ప్రభు త్వం విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా ముగిసింది. లాక్డౌన్కు వ్యాపారస్తులు, ప్రజలందరూ సహకరించడంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి
తుర్కపల్లిలో ..
తుర్కపల్లి,మే12: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. మండల కేంద్రంలోని చౌరస్తాలో పోలీస్లు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి లాక్డౌన్ను పర్యవేక్షించారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు.
నిర్మానుష్యంగా మారిన రోడ్లు
యాదాద్రి, మే12: కరోనా సెకండ్ వేవ్ మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపైకి వచ్చి తనిఖీలు నిర్వహించారు. అత్యవసర సేవలు, లాక్డౌన్లో మినహాయింపు ఇచ్చిన విభాగాల సిబ్బందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారికి వార్నింగ్ ఇచ్చి పంపించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాదగిరిగుట్ట పట్టణంలో లాక్డౌన్ ప్రశాంతంగా ప్రారంభం కాగా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుని ఇంటికే పరిమితమయ్యారు. వ్యాపారస్తులు దుకాణాలను మూసివేసి లాక్డౌన్కు మద్దతు పలికారు. లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల వరకు 11 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి తెలిపారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్..
మోటకొండూర్, మే 12: కరోనావ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను మండల వ్యాప్తంగా పోలీసులు, ప్రజాప్రతినిధులు కట్టుదిట్టంగా అమలు చేశారు. అయితే ఉదయం ఆరుగంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో మండలంలోని గ్రామాల్లో దుకాణాల వద్ద ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. అనంతరం ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎస్సై నాగరాజు ఎప్పటికప్పుడు లాక్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన పలువురు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
గుట్ట మండలంలో పక్కాగా లాక్డౌన్
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలో మొదటి రోజు పక్కాగా లాక్డౌన్ అమలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో యాదగిరిగుట్ట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ చాలా వరకు తగ్గి నిర్మానుష్యంగా మారింది.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు,మే 12: మండలంలో ప్రశాంతంగా లాక్డౌ న్ కొనసాగింది. ఎస్సై మహేశ్ అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.