ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి
ముగింపు కార్యక్రమంలో స్వీట్లు పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
ఆలేరు టౌన్, జూలై 10 : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. పట్టణ ప్రగతి – హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలేరులో శనివారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై ఆలేరు పట్టణాన్ని నందన వనంగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్, కమిషనర్ లావణ్యాలత, కౌన్సిలర్ రాయపురం నర్సింహులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్లో..
ఆలేరురూరల్, జూలై10 : పల్లె ప్రగతితో గ్రామా లు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని మండల ప్రత్యేకాధికారి అనురాధ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి ము గింపు సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండటంతో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నాయన్నారు. వివిధ గ్రామాల సర్పంచ్లు ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, బక్క రాంప్రసాద్, బండ పద్మ పర్వతాలు, వడ్ల నవ్యాశోభన్బాబు, కొటగిరి పాండరి, వంగాల శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుండాలలో…
గుండాల, జూలై 10: మండలంలోని అన్ని గ్రామాల్లో 10వ రోజు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పరిశుభ్రత, వీధులు శుభ్రం చేయడం, శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చడం తదితర పనులు ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టారు. అందులో భాగంగా శనివారం సుద్దాల గ్రామాన్ని జిల్లా మైనింగ్ ఏడీ, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీవో గార్లపాటి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో అండాలన్నారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పల్లెప్రగతి ముగింపు సందర్భంగా గ్రామసభలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీవో జనార్దన్రెడ్డి, పీఆర్ఏఈ పూర్ణచందర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రాజాపేటలో…
రాజాపేట, జూలై 10 : మండలంలో గత పది రోజులుగా కొనసాగిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం గ్రామసభలతో ముగిసింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనులపై గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గ్రామస్తులకు పంచాయతీ పాలకులు, అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దూదివెంకటాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా సర్పంచ్ వస్పరి ధనలక్ష్మీవిష్ణు వేసిన ముగ్గు, బతుకమ్మ, బోనం సమర్పించుకున్న విధానం ఎంతగానో ఆకట్టుకున్నది.
బొమ్మలరామారంలో…
బొమ్మలరామారం, జూలై 10 : గ్రామంలో పచ్చదనం పెంపొందించడం, పారిశుధ్యం వంటి సమస్యలు పరిష్కరించడం ద్వారా గ్రామ అభివృద్ధికి పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం ఉపయోగపడిందని సర్పంచ్ మేడబోయిన గణేశ్ అన్నారు. మండలంలోని ఫకీర్గూడ గ్రామంలో శనివారం పల్లె ప్రగతి ముగింపు సభను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులన్నీ మామిడితోరణాలతో, రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పంచాయతీ సిబ్బందిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొయిని లతానర్సింహా, ఉపసర్పంచ్ బొబ్బల అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), జూలై 10 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి 10రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పండుగలా కొనసాగిందని మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పల్లెప్రగతి ముగింపు గ్రామసభలో పాల్గొని మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలన్ని పరిశుభ్రంగా మారాయన్నారు. ఇదే స్ఫూర్తిని ప్రజలందరూ కొనసాగిస్తూ గ్రామాలభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా పాత ఇండ్లను పూడ్చివేసి, కలుపు మొక్కలను తొలగించి వీధులను శుభ్రపర్చి ప్రధాన వీధుల వెంట మొక్కలను నాటడంతో గ్రామ ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు. వివిధ గ్రామాల్లో జరిగిన ముగింపు గ్రామసభల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొనగా మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో ఎంపీపీ తండమంగమ్మ, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డితో పాటు వార్డు సభ్యులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, జూలై 10: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమైందని మండల ప్రత్యేకాధికారిని పరిమళాదేవి, ఎంపీడీవో వీరస్వామి అన్నారు. శనివారం నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో చివరి రోజు కావడంతో అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, అధికారులు గ్రామసభలను నిర్వహించారు. చాడ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో పాదయాత్ర నిర్వహించి గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. పది రోజుల పల్లె ప్రగతిలో చేపట్టిన పనులపై సర్పంచ్లు, గ్రామ ప్రత్యేకాధికారులు గ్రామసభలో ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు వడ్డెబోయిన శ్రీలత, చామకూర అమరేందర్రెడ్డి, మంత్రి రాజు, వేముల పాండు, కొప్పుల మమత, పైళ్ల వినోద, మల్గ ఎట్టమ్మ, ఆడెపు విజయ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని నాంచారిపేట గ్రామంలో నాల్గవ విడుత పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలను నాటి గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంచారిపేట సర్పంచ్ పైళ్ల వినోదాసుధాకర్రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో చెట్లే మానవాళికి జీవనాధారమన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జావీద్, వార్డు సభ్యుడు లింగస్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.