యాదాద్రి భువనగిరి, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబీమా.. మాదిరే.. చేనేత కార్మిక కుటుంబాలకు రూ.5లక్షల బీమా సాయం అందనున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సిరిసిల్ల జిల్లాలో అధికారికంగా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయనుండటంతో సంబంధిత శాఖ అధికారులు కార్యాచరణపై దృష్టి సారించారు. ఏదైనా కారణంతో రైతు చనిపోతే గత నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారాన్ని అందజేస్తున్నది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్యలు సహా ఏ కారణాల వల్ల చనిపోయినా మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా నాలుగు రోజుల్లోనే సాయాన్ని అందజేస్తున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో ఇకపై చేనేత కార్మిక కుటుంబాలకు సైతం ఇదే తరహాలో పరిహారం అందనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు చేనేత కార్మికులవే జరిగేవి.
అప్పట్లో ప్రభుత్వ, కార్మికుల భాగస్వామ్యంతో రూ.లక్ష బీమా పథకం అమలయ్యేది. బీమా ప్రీమియం చెల్లింపులు సమస్యగా మారాయని 2013లో దీనిని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చేనేతతోపాటు ఇతర వృత్తుల వారు ఎవరైనా చనిపోతే సీఎం సహాయ నిధి, ఆపద్బంధు, ఇతర పథకాల కింద సాయం అందిస్తున్నారు. ఇక నుంచి చేనేత వృత్తులకు సైతం బీమాను వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. ఆ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల్లోని ఇంటి పెద్దదిక్కు దూరమైతే సర్కారు సాయం ఆసరాగా నిలువనున్నది. సహకార సంఘాల పరిధిలో పనిచేసే కార్మికులతోపాటు అనుబంధ కార్మికులకు కూడా బీమా వర్తింపజేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
‘థ్రిఫ్ట్’ పథకం మళ్లీ అమలుకు చర్యలు!..
మర మగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి.. మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుల్లో.. కరోనా చేనేత బతుకులను మరింత ఛిద్రం చేసింది. నేటికీ కూడా కోలుకోక ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూత, థ్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలతో ఆదుకుంటున్నది. 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా, ప్రతి నెలా 8 శాతం పొదుపు చేసిన కార్మికుని ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభు త్వం మూడేండ్ల వ్యవధి ముగిశాక అందజేస్తున్నది. ఈ పథకంలో కార్మికులు కనిష్ఠంగా రూ.200 నుంచి రూ.1500 వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. గత ఏడాది కరోనా పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. అయితే గత ఏడాది లాక్డౌన్లో ‘చేనేతకు చేయూత’ పథకం కార్మికులకు అండ గా నిలువడంతో.. ఈ ఏడాది కూడా ‘థ్రిఫ్ట్’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉన్నది.
ఆదుకుంటున్న ‘చేనేత మిత్ర’..
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40శాతం సబ్సిడీ ఇచ్చి ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇందులో 35 శాతం కార్మికులకు చెల్లిస్తుండగా, మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి లేకుంటే గ్రూపు లీడర్కు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్హెచ్డీసీ) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పని చేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తున్నది. జనగామ, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. 2018 జూన్లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6వేల మంది రూ.3.86కోట్ల వరకు లబ్ధిపొందారు. సిల్కుకు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్పై 12 సార్లు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఈ లెక్కన మగ్గం నేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ. 1-2వేల వరకు లబ్ధి పొందవచ్చు. జిల్లాలో 1,691 బిల్లులకు గాను రూ.4.11కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. దశలవారీగా చెల్లింపులు జరుపుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు 1,601 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాలో రూ.3.86కోట్లను జమచేసి గొప్ప ఊరటను కలిగించింది.