ఆత్మకూరు(ఎం), మే 3: గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. మండలంలోని పారుపల్లి నేడు ప్రగతిపథంలో పయనిస్తున్నది. గ్రామంలో 2000 జనాభా ఉండగా, 1400 ఓటర్లు ఉన్నారు. 350 ఇండ్లు ఉన్నాయి. గ్రామాభివృద్ధి కోసం రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం రూ.41 లక్షల 10వేలు మంజూరు చేసింది. వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ నిర్మాణం పనులను పూర్తి చేశారు. గ్రామ పరిశుభ్రత కోసం పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ ఇంటింటికీ చెత్తను సేకరిస్తున్నారు. హరితహారంతో పాటు పల్లెప్రగతిలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరగడంతో పచ్చదనం ఆకట్టుకుంటున్నది.
రూ.41లక్షల 10వేలతో అభివృద్ధి పనులు
గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులతో రూ.12 లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో కంపోస్ట్షెడ్ నిర్మాణం, రూ.17లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం, రూ.2లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ.4లక్షలతో బీసీ కమ్యూనిటీహాల్, రూ.3లక్షలతో ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టారు.
పరిశుభ్రంగా గ్రామం
హరితహారంతో పాటు పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల వెంట మూడు వేల మొక్కలు నాటగా మరో 1000 మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. నాడు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగి పచ్చదనం ఆకట్టుకుంటున్నది. పరిశుభ్రతలో భాగంగా తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు ప్రతి ఇంటికీ ఉచితంగా చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
అభివృద్ధి పనులపై పర్యవేక్షణ
గ్రామంలో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో కంపోస్ట్షెడ్ నిర్మాణం పూర్తి చేశాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రోజూ గ్రామ పంచాయతీ సిబ్బంది చేత వీధులతో పాటు మురుగుకాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. అదేవిధంగా వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం కూడా పూర్తి చేశాం.
-లగ్గాని రమేశ్గౌడ్, సర్పంచ్, పారుపల్లి
పల్లె ప్రగతి ద్వారా గ్రామం మారింది
గతంలో కంటే ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామ రూపురే ఖలు మారిపోయాయి. గ్రామం లో ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత ఆకట్టుకుంటున్నది. గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి.
-ఎండీ.సాజిద్, పారుపల్లి