రాజాపేట, మార్చి 07 : మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కె.నాగవేణితో పాటు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీ జాతి ఉద్ధరణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. స్త్రీలపై దోపిడి, పీడన, అణిచివేత, వివక్షత లేని సమ సమాజ నిర్మాణం కోసం అంతా పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అడిషనల్ పీడీ సురేశ్, తాసీల్దార్ ప్రదీప్, ఎంపీఓ కిషన్, ఎంఈఎఫ్ జిల్లా నాయకుడు ఇంజ మహేశ్, మహిళ ఉద్యోగులు కె.సురేఖ, కె.సరస్వతి, వి.ఉపేంద్ర, జి.కవిత, వరిమడ్ల ఉపేంద్ర, ఉమ, మంగమ్మ, కార్యాలయ ఉద్యోగులు విజయ్ కుమార్, నరేశ్ పాల్గొన్నారు.