వలిగొండ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో గురువారం రాత్రి జరిగిన దొంగతనంపై శుక్రవారం విచారణ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు, దొంగతనాలు అదుపులో ఉంటాయని, దుకాణాల యజమానులు పెద్దమొత్తంలో నగదును రాత్రి వేళల్లో దుకాణల్లో ఉంచరాదని సూచించారు.
ప్రతి షాపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల సమాచారంతో నేరస్తులను త్వరగ పట్టుకుని బాధితులకు సత్వరమే న్యాయం అందుతుందన్నారు. నగదు చోరీపై వేగంగా దర్యాప్తు చేపట్టి నింధితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఎరువుల దుకాణం యజమాని రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట సీఐ మోతీరాం, స్థానిక ఎస్సై రాఘవేందర్గౌడ్ తెలిపారు.