యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు
త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన
సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు
యాదాద్రి, మార్చి 2 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధానాలయం పనులు పూర్తికాగా భక్తుల వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. త్వరలో ప్రతిష్ఠించనున్న కలశ స్థాపనకు పరంజా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఐదు క్యూ కాంప్లెక్స్ల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ బేలు, కమాండ్ కంట్రోల్ రూం, స్వాగత తోరణాల నిర్మాణాలు మరికొద్ది రోజుల్లో పూర్తి చేయనున్నారు. కొండపైన పడిన వర్షం నీటిని వినియోగించుకునే విధంగా భారీ సంపును నిర్మిస్తున్నారు. స్వామివారి దివ్య గాలిగోపురం వద్ద గ్యాస్ ప్లాంటుకు పచ్చదనం ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టారు.
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రధానాలయం పనులు పూర్తికాగా, భక్తుల వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. కలశస్థాపనకు కావాల్సిన పరంజా పనులు పూర్తికావచ్చాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని అధికారులు తెలిపారు.
క్యూ కాంఫ్లెక్స్లో మరుగుదొడ్లు..
భక్తుల క్యూ కాంప్లెక్స్ను సకల వసతులతో తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 4 క్యూ కాంప్లెక్సుల్లో మూడింట సాధారణ భక్తులు, మరో కాంప్లెక్స్లో వీఐపీలకు అవకాశం కల్పించనున్నారు. స్టెయిన్లెన్ స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. ఒక్కో కాంప్లెక్స్లో పది వరకు రెయిలింగ్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. భక్తులను మొదటగా క్యూ కాంప్లెక్స్లోకి అనుమతినిస్తారు. ఒక్కో కాంప్లెక్స్లో 600 మంది వేచి ఉండొచ్చు. వేచి ఉన్న భక్తులకు స్నాక్స్, మంచినీళ్లు, అందించే ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు సేద దీరే సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ సేవలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్యూ కాంప్లెక్స్లో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో కాంఫ్లెక్స్లో సుమారు 26 మరుగుదొడ్లను నిర్మించారు. మురుగు కొండకింద ప్రధాన సెప్టిక్ కాల్వలోకి వెళ్లేలా పైపులైన్లు నిర్మించారు. అగ్ని ప్రమాదం జరిగితే తక్షణమే అదుపులోకి తీసుకువచ్చేలా ఫైర్ సేఫ్టీ పైపులైన్లు ప్రతి క్యూ కాంప్లెక్స్లో బిగిస్తున్నారు. ప్రమాదాన్ని వెంటనే అదుపులోకి తీసుకువచ్చేలా అధునాతన ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచారు.
త్వరలో గోపురాలు, మండపాలకు కలశస్థాపన..
యాదాద్రి ఆలయం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురం, తూర్పు త్రితల రాజగోపురం, గర్భాలయ దివ్యవిమాన గోపురాలపై కలశ స్థాపన చేయనున్నారు. మొత్తం 126 బంగారు కలశాల స్థాపన పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం పరంజా పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కలశ స్థాపన తర్వాత మార్చి 28న సంప్రోక్షణ చేయనున్నామని వెల్లడించారు.
వరద నీరు వృథా కాకుండా..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు మరింత పటిష్టంగా చేపడుతున్నారు. ప్రతి నిర్మాణం చక్కటి ఆకృతులతో నిర్మిస్తున్నారు. భక్తులకు వసతుల కల్పనతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. కొండపై ఇప్పటికే 11 ఫ్లాట్ ఫాంలు కలిగిన రెండు బస్ బేలు, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్న కమాండ్ కంట్రోల్ రూం, స్వాగత ఆర్చి నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. యాదాద్రి కొండపై వర్షపు నీటిని కూడా వినియోగించుకునే విధంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రధానాలయం, శివాలయంలో పాటు ఆలయ పురవీధుల్లో పడిన వర్షపు నీటిని నిల్వ చేయడానికి ప్రత్యేకంగా సంపును నిర్మిస్తున్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూం పక్కన 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి సంపు పనులు కొనసాగుతున్నాయి. వర్షం నీరు సంపులోకి వెళ్లేందుకు, సంపు నీరు కొండ కిందికి వెళ్లేందుకు పైపులైన్ పనులు సాగుతున్నాయి.
గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్..
స్వామివారి దివ్య గాలి గోపురం వద్ద నిర్మించిన గ్యాస్ ప్లాంటుకు పచ్చదనం ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టారు. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆహ్లాదంతో పాటు భక్తిభావం కలిగించేలా నిర్మాణాలు ఉండాలని సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు.