ఆలేరు : ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అబ్బాసి అలామ్ అశుర్ ఖానా ( పీర్ల ) కొట్టాన్ని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సునీతామహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ముస్లింల సంప్రదాయాన్ని ప్రభుత్వం గౌరవించిందన్నారు. షాదీ ముబారక్ వంటి మహత్తర పథకానికి శ్రీకారం చుట్టి రూ. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డల వివాహాలకు రూ.1,00,116 నగదు సాయం అందజేస్తుందన్నారు.
మైనారిటీలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో వందలాది గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం నెలకొల్పిందని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మసీదుల మరమ్మతులకు, పీర్ల కొట్టాల నిర్మాణాలకు రూ. 2 కోట్ల 8 లక్షలు నిధులు మంజూరు చేశామని తెలిపారు.