– ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్
భువనగిరి అర్బన్, జూన్ 08 : విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంను అనేక ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘిస్తూ, విద్యా సంస్థలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలల నుంచే పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి, పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. అలాగే, సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% ఉచిత నిర్బంధ విద్య అందజేయాలని చట్టంలో ఉన్న కూడా జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల బస్సులకు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టి, విద్యార్థుల హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేశారు.