– బీబీనగర్ తాసీల్దార్ కార్యాలయం, పీహెచ్సి సబ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ
– మండల సర్వేయర్, ఏంఎల్ఎచ్పికి మెమో జారీ
బీబీనగర్, అక్టోబర్ 14 : భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం బీబీనగర్ తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన పలువురి దరఖాస్తుదారులతో మాట్లాడి జనన, మరణ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. సాదాబైనామా పరిష్కరానికి నోటీసులు ఇచ్చామన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో క్షేత్రస్టాయిలో పరిశీలించాలన్నారు. మండలంలో సర్వే కోసం దరఖాస్తులు ఎక్కువగా ఉండటం, సర్వే చేయడానికి, ఎక్కువ సమయం తీసుకోవడం, సర్వే చేసిన వాటిలో ఎక్కువ రిజెక్ట్ చేయడం వంటివి తన దృష్టికి వచ్చాయని, సర్వేయర్కు మెమో జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించగా అధికారులు సర్వేయర్కు మెమో జారీ చేశారు.
అనంతరం పోషన్ అభియాన్లో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోషణమాసం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో పోషణమాంసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గర్భిణిలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. దానివల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కి రోజు గర్భిణిలు వచ్చి సెంటర్లో ఇచ్చే బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలకు ఇచ్చే బాలామృతం తినిపించడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అంగన్వాడీ సెంటర్లో కనీసం 20 మంది పిల్లలు ఉండేలా చూడాలన్నారు.
బీబీనగర్ మండలం గూడూరు పల్లె దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా తాళం వేసి ఉండడంతో ఎంఎల్ఎచ్పికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డి, డీటీ భగత్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.