Indus Waters Treaty : తీవ్రవాదాన్ని పాకిస్తాన్ అంతం చేసేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాంలో పాక్ తీవ్రవాదులు దాడులకు పాల్పడి, పలువురిని హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ చర్యకు నిరసనగా.. పాకిస్తాన్తో 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా నుంచి పాకిస్తాన్కు సిందు నదీ జలాలు వెళ్లడం లేదు. ఈ కారణంగా పాకిస్తాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
ఈ విషయంలో ఇండియాపై పాకిస్తాన్ అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. విమర్శలు, బెదిరింపులకు దిగుతోంది. అయినప్పటికీ.. ఈ విషయంలో ఇండియా తన వైఖరి మార్చుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న స్థితిలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోనంత వరకు ఈ ఒప్పందం కొనసాగబోదని తెలిపాయి. తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలకు పాకిస్తాన్ స్వస్తి పలకాలని, ఈ విషయంలో పాక్ తగిన చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అది కూడా చర్చల అనంతరమే అని స్పష్టం చేసినట్లు ఒక జాతీయ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలనుకోవడం లేదని, తాత్కాలికంగా మాత్రమే ఒప్పందాన్ని నిలిపివేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక అంతర్జాతీయ ఒప్పందం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందనిపిస్తే దాన్ని రద్దు చేసే హక్కు సార్వభౌమ దేశంగా ఇండియాకు ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ ఒప్పందం నిలిపివేత విషయంలో ఇండియాపై పాక్ దుష్ప్రచారం చేస్తోంది. తమ దేశంలో నీటి కొరతకు ఇండియానే కారణమని పాక్ ఆరోపిస్తోంది.
ఇండియా నుంచి పాకిస్తాన్కు సరఫరా చేసిన నీటిని నిల్వ చేసుకుని వాడుకునే సామర్ధ్యం లేకపోవడం వల్లే ఆ దేశంలో ఈ పరిస్థితి తలెత్తిందని ఇండియా బదులిచ్చింది. అక్కడ నీటి నిల్వ సామర్ధ్యం తక్కువగా ఉండటం, లీకేజీలు, ఇతర ప్రాంతాల మధ్య ఉన్న వివాదాల కారణంగానే పాక్లో నీటి కొరత ఉందని ఇండియా అంటోంది.