రాజాపేట, ఏప్రిల్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి స్వాగతిస్తే కల్లూరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం తగదని ఆ పార్టీ మండలాధ్యక్షుడు తిరుమలేష్ అన్నారు. క్రషర్ మిషన్ పై ఎమ్మెల్యే అయిలయ్య విసిరిన సవాలుకు కట్టుబడి ఉండాలన్నారు. కలెక్టర్, జర్నలిస్టులు, అఖిలపక్ష రాజకీయ పార్టీల సమక్షంలో క్రషర్ వద్ద చర్చకు సిద్ధమని కల్లూరి రామచంద్రారెడ్డి ప్రకటన చేయగా మళ్లీ బహిరంగ చర్చకు సిద్ధమేనా? అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా చల్లూరు క్రషర్ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు తప్పు లేకుంటే చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దినపత్రికల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా క్రషర్ నడుస్తున్నదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టారని పతాక శీర్షికలలో ప్రచురితమైన కథనాలు మీ అవినీతిని ఎండగట్టిన విషయం మీరు చదవలేదా అన్నారు. రాజపేట పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే అయిల్లయ్య వీడియో రికార్డ్ చేసి విడుదల చేసిన దాంట్లో చాలా స్పష్టంగా చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావడానికి దమ్ము లేక విమర్శలు చేస్తున్నారన్నారు.
విసిరిన సవాలుకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కట్టుబడి ఉండి బహిరంగ చర్చకు రావాలన్నారు. ఆలేరు నియోజకవర్గం ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి, యాదగిరి గౌడ్, ఎరుగోకుల జశ్వంత్, బొంగోని ఉప్పలయ్య, బెడిద వీరేశం, మాజీ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి, ఎమ్మ భాస్కర్, గంధమల్ల సురేష్, సతీష్, విష్ణు, గొల్ల రాజయ్య, ఉపేందర్ పాల్గొన్నారు.