చౌటుప్పల్, మే 22 : చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏడున్నర నెలల గర్భిణి (27)కి అరుదైన వైద్య చికిత్స నిర్వహించి వైద్యులు ప్రాణాలను కాపాడారు. తీవ్ర కడుపునొప్పి, బీపీ పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ మలక్పేటలోని యశోద ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఆమెకు అత్యంత ప్రమాదకరమైన “ప్లాసెంటా పర్క్రేటా” కారణంగా గర్భాశయం చీలిపోయినట్లు గుర్తించారు. దీంతో పాటు తీవ్ర అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గర్భంలోని శిశువు మృతి చెందింది. తక్షణమే ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి.వి.జ్యోత్స్న నేతృత్వంలో వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ కలాధర్ ప్రత్యేక వైద్య చికిత్స నిర్వహించి మహిళ ప్రాణాలను కాపాడారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో గర్భసంచి తొలగించే పరిస్థితి వస్తుందని, అయితే ప్రత్యేక శస్త్రచికిత్సల ద్వారా గర్భసంచిని సంరక్షిస్తూ భవిష్యత్లో తిరిగి గర్భం దాల్చే అవకాశం ఉండేలా చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం హైవే-9 హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య బృందం వెల్లడించింది.