భువనగిరి అర్బన్, నవంబర్ 12 : 5వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్-2021 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. భువనగిరి పట్టణ పరిధిలోని న్యూ డైమెన్షన్ పాఠశాలలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ జ్యోతి ప్రజ్వళన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. మూడురోజులు జరిగే పోటీలకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబాబునగర్ జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడాతూ రాష్ట్రస్థాయి హాకీ పోటీలను జిల్లాలో ప్రథమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి కల్గించేలా కోచ్లు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించడంతో గ్రామ స్థాయిలోని క్రీడా కారులు వెలికివస్తారని చెప్పారు.
క్రీడాకారులకు అన్ని వసతులు
హాకీ పోటీలను యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు బి.కిరణ్కుమార్గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. న్యూ డైమెన్షన్ స్కూల్ మేనేజ్మెంట్ పులిమామిడి సుభాశ్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు తాగునీరు, పాఠశాల గ్రౌండ్, వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కె.ధనంజనేయులు, హాకీ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ లచ్చు, తెలంగాణ అసోసియేషన్ కోశాధికారి భాస్కర్రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు కాశి, వివిధ జిల్లాల కార్యదర్శులు ఉస్మాన్, కుమారి, రమణ, కరీం, స్థానిక పీఈటీలు, ఉమ్మడి 10 జిల్లాల కోచ్ లు, హాకీ క్రీడాకారులు శ్రీనివాస్గౌడ్, సిద్దిరాములు, పెద్దబోయిన మణి, నోముల శివకుమార్, లవణం నరేందర్, గోదాసు ప్రవీణ్, రాము, ఉదయ్, విజయ్, రాజు పాల్గొన్నారు.
క్రీడాకారులకు జెర్సీ
హాకీ క్రీడాకారులకు క్రీడా దుస్తులను రామన్నపేటకు చెందిన చీకూరి విజయ్ చారిటబుల్ ట్రస్టు ప్రెసిడెంట్, టీఎన్జీఏ జిల్లా ప్రెసిడెంట్ చీకూరి జగన్ అందజేశారు.
హాకీపై ఆసక్తి ఎక్కువ
నేను డిగ్రీ ఫైన ల్ ఇయర్ చదువుతున్న. నాకు హాకీ అం టే ఎంతో ఇష్టం. ఇప్ప టి వరకు పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, బెంగళూర్లో జరిగిన జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న. 9 సార్లు జాతీయ, 20 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న.
-ఎన్.సంతోష్, వనపర్తి,మహబూబునగర్ జిల్లా జట్టు కెప్టెన్
చాలా సంతోషంగా ఉంది
నేను ఉమ్మడి నల్లగొండ జట్టులో క్రీడాకారుడిని. గతంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయేది. సొంత జిల్లా కావడంతో సంతోషంగా పాల్గొంటున్న. మా జట్టుకు మొదటి బహుమతి వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా.
క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి
భారత హాకీ జట్టు మాజీ కెప్టన్ ముఖేశ్కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించాలంటే నిరంతరం ప్రాక్టీస్, ఏకాగ్రత అవసరమని అన్నారు. పిల్లలు ప్రాథమిక స్థాయి నుంచి క్రీడల పట్ల అవగాహన పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. పాఠశాలల్లో చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా పీఈటీలు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు.