రాజాపేట, ఏప్రిల్ 18 : వేసవి కాలంలో గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాజాపేట ఎస్ఐ లింగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు జరగకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అన్నారు. ఇంటి ఆవరణలో, డాబాలపై నిద్రిస్తున్న సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలన్నారు. శుభకార్యాలకు, ఊరికి వెళ్లే సమయంలో పొరుగువారికి చెప్పడంతో పాటు విలువైన బంగారం, వెండి నగలు, నగదు ఇంట్లో కాకుండా బ్యాంక్లో భద్రపరచుకోవాలన్నారు. గ్రామంలో కొత్తగా కనిపించే అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాత్రి వేళల్లో యువత గస్తీ నిర్వహించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం పోలీస్ నంబర్లు అందరికీ తెలియపరచాలన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ నంబర్లు సేవ్ చేసుకోవాలని పేర్కొన్నారు.